Wine Shops: 2026 నూతన సంవత్సర వేడుకలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 31 రాత్రి వేడుకలు చేసుకునే వారి కోసం రాష్ట్రవ్యాప్తంగా మద్యం విక్రయాల సమయాన్ని పొడిగిస్తూ ఎక్సైజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పాత ఏడాదికి వీడ్కోలు చెబుతూ, కొత్త ఏడాదికి స్వాగతం పలికే క్రమంలో సామాన్యులకు, పర్యాటకులకు ఇబ్బంది కలగకుండా ఈ వెసులుబాటు కల్పించారు. గతేడాది అనుసరించిన విధానాన్నే ఈ ఏడాది కూడా కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
నూతన నిబంధనల ప్రకారం, రాష్ట్రంలోని A4 మద్యం దుకాణాలు డిసెంబర్ 31 మరియు జనవరి 1వ తేదీ రాత్రుల్లో అర్ధరాత్రి 12 గంటల వరకు తెరిచి ఉంచవచ్చు. అలాగే, బార్లు, ఇన్-హౌస్ లైసెన్సులు కలిగిన హోటళ్లు, ఏపీ టూరిజం హోటళ్లు మరియు ఈవెంట్ పర్మిట్లు ఉన్న చోట రాత్రి 1 గంట వరకు మద్యం విక్రయాలకు మరియు సర్వీసులకు అనుమతి ఇచ్చారు. వేడుకల జోష్లో ఉన్న వారికి ఇది నిజంగానే ఊరటనిచ్చే అంశం.
అయితే, సమయం పెంచడమే కాకుండా నిబంధనల విషయంలోనూ ప్రభుత్వం కఠినంగా వ్యవహరించనుంది. ఈ వేడుకల సాకుతో అక్రమ మద్యం లేదా పన్ను చెల్లించని మద్యం అమ్మకాలు జరిగితే సహించేది లేదని ఎక్సైజ్ శాఖ హెచ్చరించింది. సరిహద్దుల నుండి అక్రమ మద్యం రాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. వేడుకలు ప్రశాంతంగా జరిగేలా చూడాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎన్ఫోర్స్మెంట్ బృందాలు నిరంతరం నిఘా ఉంచాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.
