Bihar: బిహార్ రాష్ట్రంలో ఆదివారం తెల్లవారుజామున ఒక భయానక రైలు ప్రమాదం చోటుచేసుకుంది. ఆసన్సోల్ నుండి సీతామఢీకి సిమెంటు లోడుతో వెళ్తున్న ఒక గూడ్స్ రైలు టెల్వాబజార్ హాల్ట్ సమీపంలో ప్రమాదానికి గురైంది. ప్రయాణిస్తున్న సమయంలో రైలు ఒక్కసారిగా పట్టాలు తప్పడంతో, వంతెన పైనుంచి సుమారు 19 బోగీలు కిందకు పడిపోయాయి. పట్టాలు తప్పిన వేగానికి బోగీలు ఒకదానిపై ఒకటి పడి తీవ్రంగా దెబ్బతిన్నాయి.
Also Read: Film Chamber Elections: ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికలు ప్రారంభం.. రెండు ప్యానెల్స్ మధ్య హోరాహోరీ
ఈ ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే రైల్వే పోలీసులు, ఆర్పీఎఫ్ (RPF) బలగాలు, రైల్వే సాంకేతిక బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. వంతెన పైనుంచి బోగీలు కింద పడినప్పటికీ, ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అధికారులు, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం రైల్వే సిబ్బంది సహాయక చర్యలు చేపట్టి, పట్టాల పునరుద్ధరణ పనులను వేగవంతం చేశారు. రైల్వే పోలీసులు ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి, సాంకేతిక లోపం వల్ల జరిగిందా లేదా మరేదైనా కారణం ఉందా అనే కోణంలో దర్యాప్తు జరుపుతున్నారు.
