Salman Khan: బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్కు రాజస్థాన్లోని కోటా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ షాక్ ఇచ్చింది. ఒక పాన్ మసాలా ప్రకటనకు సంబంధించిన కేసులో ఆయన సంతకంపై ఫోరెన్సిక్ పరీక్ష నిర్వహించాలని కోర్టు ఆదేశించింది. అంతేకాకుండా, వచ్చే ఏడాది జనవరి 20న సంబంధిత పత్రాలతో కోర్టుకు వ్యక్తిగతంగా హాజరు కావాలని సల్మాన్ను ఆదేశించింది.
ఏమిటీ వివాదం? బీజేపీ నాయకుడు, న్యాయవాది ఇంద్రమోహన్ సింగ్ హానీ.. సల్మాన్ ఖాన్, రాజశ్రీ పాన్ మసాలా కంపెనీపై కోటా వినియోగదారుల కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. “కుంకుమపువ్వుతో కూడిన యాలకులు” (Saffron-infused Cardamom) పేరుతో ఇచ్చే ఈ ప్రకటన ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉందని ఆయన ఆరోపించారు. కేవలం 5 రూపాయలకే లభించే ప్యాకెట్లో, కిలో లక్షల రూపాయలు పలికే కుంకుమపువ్వు ఉండటం అసాధ్యమని, ఇలాంటి ప్రకటనల వల్ల యువత ఆరోగ్యానికి ముప్పు వాటిల్లుతుందని ఆయన వాదించారు.
ఇది కూడా చదవండి: Tirumala: తిరుమలలో పెరిగిన భక్తుల తాకిడి.. సర్వదర్శనానికి పడుతున్న సమయం ఎంతంటే?
సంతకంపై అనుమానాలు: ఈ కేసు విచారణలో భాగంగా సల్మాన్ ఖాన్ తరపున సమర్పించిన పవర్ ఆఫ్ అటార్నీ (Power of Attorney), సమాధాన పత్రాలపై ఉన్న సంతకాలు నకిలీవని ఇంద్రమోహన్ సింగ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. జోధ్పూర్ జైలులో ఉన్నప్పుడు, గత కోర్టు విచారణల సమయంలో సల్మాన్ చేసిన సంతకాలకు, ఇప్పుడు పత్రాల్లో ఉన్న సంతకాలకు తేడాలు ఉన్నాయని ఆయన ఆరోపించారు. ఈ వాదనను పరిగణనలోకి తీసుకున్న కోర్టు, సంతకాలను ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ (FSL) ద్వారా పరీక్షించాలని నిర్ణయించింది.
కోర్టు ఆదేశాలు: వినియోగదారుల రక్షణ చట్టం 2019లోని సెక్షన్ 38(9)(d) ప్రకారం, సంతకాలను ప్రభుత్వ గుర్తింపు పొందిన ఏజెన్సీతో తనిఖీ చేయించాలని కోర్టు ఆదేశించింది. జనవరి 20న జరిగే తదుపరి విచారణకు సల్మాన్ ఖాన్తో పాటు, ఆ సంతకాలను నోటరీ చేసిన న్యాయవాది ఆర్.సి. చౌబే కూడా హాజరు కావాల్సి ఉంటుంది. అయితే, సల్మాన్ ఖాన్ న్యాయ బృందం మాత్రం ఈ ఆరోపణలను కొట్టిపారేస్తోంది. ఆ సంతకాలు నిజమైనవేనని, అవి ఆయన పాన్ కార్డ్, పాస్పోర్ట్లోని సంతకాలతో సరిపోలుతున్నాయని వారు వాదిస్తున్నారు.
