Vajpayee statue

Vajpayee statue: అమరావతిలో ఘనంగా వాజ్‌పేయీ విగ్రహావిష్కరణ

Vajpayee statue: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో మాజీ ప్రధానమంత్రి, భారతరత్న అటల్ బిహారీ వాజ్‌పేయీ విగ్రహం కొలువుదీరింది. వాజ్‌పేయీ జయంతిని పురస్కరించుకుని బుధవారం వెంకటపాలెంలో ఏర్పాటు చేసిన ఈ భారీ విగ్రహాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కలిసి ఆవిష్కరించారు. ఈ విగ్రహం అమరావతికి ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.

సుమారు 13 అడుగుల ఎత్తు ఉన్న ఈ కాంస్య విగ్రహాన్ని అత్యంత సుందరంగా తీర్చిదిద్దారు. విగ్రహావిష్కరణ అనంతరం సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. దేశాభివృద్ధిలో వాజ్‌పేయీ చేసిన కృషిని కొనియాడారు. ముఖ్యంగా నదుల అనుసంధానం, స్వర్ణ చతుర్భుజి వంటి పథకాలతో ఆయన దేశ గమనాన్ని మార్చేశారని గుర్తు చేసుకున్నారు. వాజ్‌పేయీ వంటి గొప్ప నాయకుడి విగ్రహాన్ని రాజధాని ప్రాంతంలో ఏర్పాటు చేయడం గర్వకారణమని ఆయన పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు పెమ్మసాని చంద్రశేఖర్, భూపతిరాజు శ్రీనివాసవర్మతో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. వాజ్‌పేయీ ఆశయాలకు అనుగుణంగా రాష్ట్రాన్ని, దేశాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తామని ఈ సందర్భంగా నాయకులు స్పష్టం చేశారు. ఈ విగ్రహావిష్కరణతో వెంకటపాలెం పరిసర ప్రాంతాల్లో పండుగ వాతావరణం నెలకొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *