Haryana: హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే గెలిచిన ఎమ్మెల్యేల్లో ఎంత మంది కోటీశ్వరులు ఉన్నారనే జాబితా కోసం చాలా మంది ఇంటర్నెట్ లో పరిశోధించడం మొదలు పెట్టారు. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఓ జాబితాను విడుదల చేసింది.
గెలుపొందిన ఎమ్మెల్యేల్లో 96శాతం మంది కోటీశ్వరులే ఉన్నారు. అలాగే, 13 మంది ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఎన్నికల్లో గెలుపొందిన 90 మంది అభ్యర్థులలో 86 మంది ఎమ్మెల్యేలు కోటీశ్వరులు ఉన్నారు. ఎన్నికల్లో గెలుపొందిన కోటీశ్వరుల ఎమ్మెల్యేల సంఖ్య గత ఎన్నికల పోలిస్తే మూడుశాతం పెరిగింది. 90 మందిలో 44శాతం మందికి రూ.10కోట్లకంటే ఎక్కువగా ఆస్తులున్నాయి. కేవలం 2.2శాతం మందికి మాత్రమే రూ.20లక్షలోపు ఆస్తులున్నట్లుగా తేలింది.
14శాతం మంది మహిళా ఎమ్మెల్యేలు అసెంబ్లీలోకి అడుగుపెట్టనున్నారు. 96శాతం బీజేపీ, 95శాతం కాంగ్రెస్, ఐఎన్ఎల్డీతో పాటు స్వతంత్ర అభ్యర్థులు వందశాతం తమకు రూ.కోటికి కంటే ఎక్కువగా ఆస్తులు ఉన్నట్లు ప్రకటించారు. హిసార్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన సావిత్రి జిందాల్ రూ.270కోట్ల ఆస్తులతో అగ్రస్థానంలో ఉన్నారు.రూ.145 కోట్లతో బీజేపీకి చెందిన శక్తి రాణిశర్మ, రూ.134 కోట్ల ఆస్తులతో శృతి చౌదరి ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు.