Hyderabad: హైదరాబాద్లోని మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక విషాదకర సంఘటన వెలుగు చూసింది. స్థానిక భార్గవి లేడీస్ హాస్టల్ భవనం టెర్రస్పై నివసిస్తున్న హారిక (40) అనే మహిళ అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోయింది. టెర్రస్పై ఉన్న బాత్రూంలో ఆమె మృతదేహం పడి ఉండటాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న మధురానగర్ పోలీసులు తక్షణమే ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మరణించిన హారిక సొంత ఊరు గుంటూరు జిల్లా అని పోలీసులు గుర్తించారు. ఆమె గత కొంతకాలంగా హాస్టల్ టెర్రస్పై ఉన్న గదిలో ఒంటరిగా నివసిస్తున్నట్లు తెలిసింది. మృతదేహం స్థితిని బట్టి చూస్తే, ఆమె చనిపోయి దాదాపు రెండు రోజులు అయ్యి ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.
ప్రస్తుతానికి ఈ మరణంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బాత్రూంలో ప్రమాదవశాత్తు జారిపడి చనిపోయిందా లేదా మరేదైనా కారణం ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. క్లూస్ టీమ్ ద్వారా ఆధారాలు సేకరించిన పోలీసులు, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు పూర్తిస్థాయి విచారణ చేపడుతున్నారు.
