AP News

AP News: సత్యసాయి జిల్లాలో దారుణం.. గర్భిణిపై వైసీపీ కార్యకర్త దాడి

AP News: శ్రీసత్యసాయి జిల్లా తనకల్లు మండలంలోని ముత్యాలవారిపల్లె గ్రామంలో ఒక దురదృష్టకర సంఘటన చోటుచేసుకుంది. వైసీపీ అధ్యక్షుడు జగన్ పుట్టినరోజు వేడుకల సందర్భంగా జరిగిన ఈ గొడవలో, ఒక గర్భిణిపై దాడి జరగడం స్థానికంగా కలకలం రేపింది. రాజకీయ వేడుకల పేరుతో సామాన్యులకు ఇబ్బంది కలిగించడం, పైగా మహిళ అని కూడా చూడకుండా దాడికి తెగబడటంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అసలేం జరిగిందంటే.. గ్రామంలో జగన్ పుట్టినరోజు వేడుకలను వైసీపీ కార్యకర్తలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో అజయ్‌దేవ్ అనే కార్యకర్త, అదే గ్రామానికి చెందిన సంధ్యారాణి అనే గర్భిణి ఇంటి ముందు టపాసులు పేల్చడం మొదలుపెట్టాడు. ఇంటి దగ్గర టపాసులు పేల్చవద్దని, గర్భిణికి ఇబ్బందిగా ఉంటుందని ఆమె కుటుంబ సభ్యులు సున్నితంగా వారించారు. అయితే, తనను అడ్డుకుంటారా అనే అహంకారంతో అజయ్‌దేవ్ రెచ్చిపోయి సంధ్యారాణిపై భౌతిక దాడికి పాల్పడ్డాడు.

ఈ దాడి కారణంగా సంధ్యారాణి తీవ్రమైన కడుపునొప్పితో విలవిలలాడిపోయింది. ఆమె పరిస్థితి విషమించడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను కదిరిలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె అక్కడ చికిత్స పొందుతోంది. వేడుకల పేరుతో ఇలాంటి హింసాత్మక ఘటనలకు పాల్పడటం సరికాదని, నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబ సభ్యులు మరియు గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *