YS Sharmila: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడూ తెరవెనుకనే ఉంటుందని భావిస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) – భారతీయ జనతా పార్టీ (బీజేపీ) దోస్తీ, ఉపరాష్ట్రపతి ఎన్నికల సందర్భంలో మరోసారి బయటపడిందని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ధ్వజమెత్తారు. వైసీపీ నిజమైన ముఖం మరోసారి బయటపడిందని, ఆ పార్టీ బీజేపీకి “బీ టీమ్” అని స్పష్టంగా రుజువైందని ఆమె విమర్శించారు.
తాజాగా జరిగిన ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థికి వైసీపీ మద్దతు ప్రకటించడంపై షర్మిల తీవ్రంగా స్పందించారు. ఈ చర్యతో రాష్ట్రంలో ప్రతిపక్షం ముసుగులో ఉన్నది మోడీ పక్షమేనని తేలిపోయిందని ఆమె ఎక్స్ (గతంలో ట్విట్టర్) వేదికగా వ్యాఖ్యానించారు. అవినీతి కేసులకు భయపడి వైసీపీ బీజేపీకి దాసోహం అంటోందని ఆరోపించారు.
ఒక తెలుగు బిడ్డ, న్యాయ నిపుణుడిని ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా నిలబెట్టినప్పుడు మద్దతు ఇవ్వలేకపోవడం తెలుగు ప్రజలకు చేసిన ద్రోహం కాదా అని షర్మిల వైసీపీని ప్రశ్నించారు. ఇది బీజేపీకి ఊడిగం చేసే బానిసల చర్య అని, వైసీపీ అధినేత జగన్ బయట ఒకలా, లోపల మరోలా వ్యవహరిస్తారని ఆమె అన్నారు.
షాకింగ్గా, షర్మిల బీజేపీకి కొత్త నిర్వచనం ఇచ్చారు: “బాబు-జగన్-పవన్” అని. ఈ ముగ్గురు నేతలు మోడీకి తొత్తులని, బీజేపీకి బానిసలుగా పనిచేస్తున్నారని ఆమె ఆరోపించారు. టీడీపీ, జనసేన పార్టీలు తెరమీద పొత్తు పెట్టుకోగా, వైసీపీది మాత్రం తెర వెనుక అక్రమ పొత్తుగా ఆమె వర్ణించారు.
Also Read: Sri Lanka: శ్రీలంక మాజీ అధ్యక్షుడు రణిల్ విక్రమ సింఘే అరెస్ట్
వైసీపీ రాష్ట్రంలో కూటమి పక్షాలతో కుస్తీ పడుతూ, ఢిల్లీలో బీజేపీతో దోస్తీ కొనసాగిస్తోందని షర్మిల విమర్శించారు. ఐదేళ్లు దోచుకున్నది దాచుకోవడానికే బీజేపీకి జై కొడుతున్నారని ఆమె ఆరోపించారు. మణిపూర్, గోద్రా అల్లర్లలో ఆర్ఎస్ఎస్ చేస్తున్న ఆగడాలపై మౌనంగా ఉంటూ, రాహుల్గాంధీ లాంటి ప్రతిపక్ష నేతలపై ఉవ్వెత్తున లేస్తారని విమర్శించారు.
బీజేపీ అభ్యర్థి, ఆర్ఎస్ఎస్ వాదికి మద్దతు ఇవ్వడం ద్వారా తెలుగు ప్రజలకు ద్రోహం చేసినందుకు వైసీపీ ప్రజలకు కచ్చితంగా సమాధానం చెప్పాలని షర్మిల డిమాండ్ చేశారు. ఈ సంఘటనతో బీజేపీ-వైసీపీ మధ్య రహస్య బంధం మరోసారి బట్టబయలైందని ఆమె అన్నారు. గతంలో ఐదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు కూడా వైసీపీ బీజేపీకి మద్దతు ఇచ్చిందని, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ ఆ దోస్తీ కొనసాగిస్తోందని ఆమె గుర్తు చేశారు. ఈ వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపాయి. వైసీపీ నిజంగా బీజేపీకి బీ టీమా? రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమా? అన్న ప్రశ్నలు ఇప్పుడు ప్రజల్లో తలెత్తుతున్నాయి.
YCP @YSRCParty ముసుగు మళ్ళీ తొలగింది. లోనున్న కాషాయ కండువా మరోసారి బయటపడింది. బీజేపీకి @BJP4India బీ-టీం అని నిజ నిర్ధారణ జరిగింది. మోడీ @narendramodi గారికి దత్తపుత్రుడే అని రాష్ట్ర ప్రజలకు కుండబద్దలు కొట్టినట్లు అర్ధం అయ్యింది. ఈ రాష్ట్రంలో ప్రతిపక్షం ముసుగులో ఉన్నది మోడీ గారి…
— YS Sharmila (@realyssharmila) August 22, 2025

