Ys Sharmila: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్ కుటుంబం నుంచి మూడో తరం ఎంట్రీపై నెలలుగా సాగుతున్న ఊహాగానాలకు ముగింపు లభించింది. రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తన కుమారుడు వైఎస్ రాజారెడ్డి రాజకీయాల్లోకి రాబోతున్నారని అధికారికంగా ప్రకటించారు. సరైన సమయం వచ్చినప్పుడే ఆయన రాష్ట్ర రాజకీయాల్లో అడుగుపెడతారని షర్మిల స్పష్టం చేశారు.
కర్నూలు పర్యటనలో షర్మిల ప్రకటన
ఈరోజు రాజారెడ్డి తన తల్లి షర్మిలతో కలిసి కర్నూలు పర్యటనకు వెళ్లారు. పర్యటనకు ముందుగా హైదరాబాద్లోని నివాసంలో అమ్మమ్మ వైఎస్ విజయమ్మ ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం కర్నూలులోని ఉల్లి మార్కెట్లో రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విలేకరుల ప్రశ్నలకు సమాధానమిస్తూ షర్మిల తన కుమారుడి రాజకీయ ప్రవేశంపై సంచలన ప్రకటన చేశారు.
ఊహాగానాలకు తెర
ఇటీవల దివంగత ముఖ్యమంత్రి డా. వైఎస్ రాజశేఖరరెడ్డి 16వ వర్ధంతి సందర్భంగా పులివెందులలో ఘాట్ వద్ద నివాళి కార్యక్రమంలో రాజారెడ్డి తన తల్లి షర్మిల పక్కనే కూర్చోవడం అందరి దృష్టిని ఆకర్షించింది. అప్పటి నుంచి ఆయన రాజకీయ రంగప్రవేశంపై ఊహాగానాలు మొదలయ్యాయి. తాజా కర్నూలు పర్యటనలో ప్రత్యక్షంగా పాల్గొనడం, షర్మిల అధికారిక ప్రకటన ఇవ్వడం వల్ల ఆ వార్తలు నిజమని తేలిపోయింది.
రాజారెడ్డి వ్యక్తిగత జీవితం
రాజారెడ్డి అమెరికాలో ఉన్నత విద్యాభ్యాసం పూర్తి చేశారు.
గత ఏడాది చట్నీస్ వ్యవస్థాపకుడు ప్రసాద్ అట్లూరి మనవరాలు ప్రియా అట్లూరిని వివాహం చేసుకున్నారు.