YS Jagan: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు విజయవాడలో పర్యటించనున్నారు. ఇటీవల తమ నివాసాలను కోల్పోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్న భవానీపురం జోజీ నగర్ బాధితులను ఆయన స్వయంగా కలిసి పరామర్శించనున్నారు.
పర్యటన వివరాలు ఇవే
తమ ఇళ్లను కోల్పోయిన 42 ఫ్లాట్ల బాధితులు ఎదుర్కొంటున్న కష్టాలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు జగన్ ఈ పర్యటన పెట్టుకున్నారు. ఆయన పర్యటన షెడ్యూల్ ప్రకారం, వైఎస్ జగన్ ఈ రోజు ఉదయం 10 గంటలకు బెంగుళూరు నుంచి బయలుదేరుతారు. మధ్యాహ్నం 12 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా భవానీపురం బయలుదేరి, 12.50 గంటలకు జోజీ నగర్కు చేరుకుంటారు. అక్కడ ఇళ్లను కోల్పోయి నష్టపోయిన 42 మంది బాధితులను కలుసుకుని, వారికి జరిగిన నష్టం గురించి, ప్రస్తుతం వారు పడుతున్న ఇబ్బందుల గురించి వివరంగా అడిగి తెలుసుకుంటారు.
హామీ మేరకు పర్యటన
ఇప్పటికే ఆ దుర్ఘటన బాధితులు కొందరు జగన్ను కలిసి తమకు జరిగిన అన్యాయాన్ని, ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. ఆ సమయంలోనే జగన్ వారికి స్వయంగా వచ్చి పరిస్థితిని పరిశీలిస్తానని హామీ ఇచ్చారు. ఇప్పుడు ఆ హామీ మేరకే ఆయన ఈ రోజు భవానీపురం జోజీ నగర్కు వెళ్లి పరిస్థితిని దగ్గరగా సమీక్షించనున్నారు. బాధితులతో పరామర్శ పూర్తయిన తర్వాత వైఎస్ జగన్ తాడేపల్లిలోని తన నివాసానికి తిరిగి చేరుకోనున్నట్లు సమాచారం.
