YS Jagan Padayatra: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి సుదీర్ఘ పాదయాత్రకు సిద్ధమవుతున్నారు. గతంలో పాదయాత్ర ద్వారానే ప్రజల కష్టాలను తెలుసుకుని, అధికారంలోకి వచ్చిన జగన్.. ఇప్పుడు మళ్ళీ అదే బాట పట్టాలని నిర్ణయించుకున్నారు. తాడేపల్లిలోని తన నివాసంలో ఏలూరు నియోజకవర్గ కార్యకర్తలతో జరిగిన సమావేశంలో జగన్ ఈ కీలక ప్రకటన చేశారు. వచ్చే ఏడాది నుంచి రాష్ట్రవ్యాప్తంగా తన పాదయాత్ర ప్రారంభమవుతుందని ఆయన స్పష్టం చేయడంతో వైసీపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది.
ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్న తరుణంలో, ప్రజల పక్షాన పోరాడేందుకు జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. కేవలం పాదయాత్ర మాత్రమే కాకుండా, పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేసేందుకు ఆయన ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగానే ప్రతి వారం ఒక అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన ముఖ్య నాయకులు, కార్యకర్తలతో జగన్ నేరుగా సమావేశం కానున్నారు. క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలు, రాజకీయ పరిణామాలను అడిగి తెలుసుకుంటూ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు.
Also Read: AP Liquor Case: ఏపీ మద్యం కేసులో ఊహించని ట్విస్ట్.. ఆ ముగ్గురికి ఇక భయం లేదు!
ఏలూరు నియోజకవర్గ కార్యకర్తలతో జరిగిన ఈ భేటీలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ జయప్రకాష్, పార్లమెంట్ ఇన్ఛార్జ్ కారుమూరి సునీల్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. ప్రజలతో మమేకం అవ్వడమే మన లక్ష్యమని, అందుకే వచ్చే ఏడాది నుంచి పాదయాత్ర చేపడతానని చెప్పారు. అయితే ఈ యాత్ర ఎప్పుడు ప్రారంభమవుతుంది? ఏయే జిల్లాల మీదుగా సాగుతుంది? అనే పూర్తి వివరాలు, రూట్ మ్యాప్ త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి నుంచి జగన్ వరకు పాదయాత్ర అనేది ఆ కుటుంబానికి సెంటిమెంట్గా మారుతూ వస్తోంది. గతంలో 3,600 కిలోమీటర్లకు పైగా జగన్ చేసిన ‘ప్రజా సంకల్ప యాత్ర’ రాజకీయాల్లో పెను మార్పులు తీసుకువచ్చింది. ఇప్పుడు మళ్ళీ అదే తరహాలో జనంలోకి వెళ్లడం ద్వారా పోగొట్టుకున్న అధికారాన్ని తిరిగి దక్కించుకోవచ్చని వైసీపీ భావిస్తోంది. త్వరలోనే ఈ యాత్రకు సంబంధించిన పూర్తి షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది.
