Yadagirigutta:తెలంగాణలోనే ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట ఆలయానికి స్వయం ప్రతిపత్తి దక్కనున్నది. ఇప్పటికే ప్రత్యేక తెలంగాణ ఏర్పాటయ్యాక, మాజీ సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో ఆలయ రూపురేఖలనే మార్చారు. పెద్ద ఎత్తున నిధులు కేటాయించి పునరుద్ధరించారు. దానిని ప్రస్తుత రేవంత్రెడ్డి సర్కారు కూడా కొనసాగింపుగా చర్యలు తీసుకుంటున్నది. ఈ నేపథ్యంలోనే తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) తరహాలోనే యాదగిరిగుట్టకు ఆలయ ట్రస్టు బోర్డును ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్రెడ్డి సారధ్యంలోని మంత్రిమండలి తాజాగా నిర్ణయం తీసుకున్నది.
Yadagirigutta:యాదగిరిగుట్ట ఆలయానికి టీటీడీ తరహాలో ఆలయ ట్రస్టు బోర్డు ఏర్పాటు చేసి స్వయంప్రతిపత్తి కల్పించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఆలయం మాత్రం రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోకి వస్తుంది. ఈ మేరకు ఆలయానికి ట్రస్ట్ బోర్డు, పదవీకాలం, నిధులు, ఉద్యోగ నియామకాలు, బదిలీలకు సంబంధించిన సర్వీస్ రూల్స్, ఈవోగా ఏ స్థాయి అధికారి ఉండాలనే వివరాలను సంబంధిత అధికారులు మంత్రివర్గానికి నోట్ రూపంలో అందించారు. దేవాదాయ శాఖ చట్టం-1987లోని చాఫ్టర్ 14 కింద ఈ దేవస్థానాన్ని చేర్చారు. త్వరలో జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో ఈమేరకు చట్టసవరణ చేయనున్నారు.
Yadagirigutta:యాదగిరిగుట్ట దేవస్థానానికి ఈవోగా ఐఏఎస్ అధికారిని, లేదంటే అదనపు కమిషనర్, ఆపై స్థాయి అధికారిని నియమించాలని క్యాబినెట్కు సమర్పించిన నోట్లో అధికారులు పేర్కొన్నారు. ఆలయ ట్రస్ట్ బోర్డుకు చైర్మన్తోపాటు 10 మంది సభ్యులను కూడా నియమిస్తారు. ఇందులో ఒకరు ఫౌండర్ ట్రస్టీ కాగా, తొమ్మిది మందిని ప్రభుత్వం నియమిస్తుంది. ఇంకా ఎక్స్ అఫీషియో సభ్యులు కూడా ఉంటారు.

