Yadagirigutta: తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయ ఈవో వెంకట్రావు తాజాగా రాజీనామా కలకలం చెలరేగింది. ఆయన చెప్పే కారణం ఏదైనా రాజకీయ వేధింపులతోనే తన పదవికి ఆయన రాజీనామా చేశారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాకు చెందిన కీలక ప్రజాప్రతినిధుల ఒత్తిళ్లతోనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.
Yadagirigutta: తన ఈవో పదవికి తాను రాజీనామా చేస్తున్నట్టు వెంకట్రావు ఒక ప్రకటనలో తెలిపారు. గత 8 నెలలుగా తనపై చూపిన ఆదరణ, మద్దతుకు అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. కొన్ని అనారోగ్య సమస్యల కారణంగా తాను రాజీనామా నిర్ణయం తీసుకున్నట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు. వెంకట్రావు గతంలో దేవాదాయ శాఖ కమిషనర్గా, ఆలయాల ఈవోగా పనిచేశారు. ఇటీవలే రిటైర్డ్ కాగా, ప్రతిష్ఠాత్మకమైన యాదగిరిగుట్ట ఆలయ బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది.
Yadagirigutta: ఇదిలా ఉంటే.. యాదాద్రి జిల్లాకు చెందిన ఓ ఇద్దరు కీలక ప్రజాప్రతినిధుల వేధింపులు తట్టుకోలేక యాదగిరిగుట్ట ఆలయ ఈవో పదవికి వెంకట్రావ్ రాజీనామా చేశారని ఉమ్మడి నల్లగొండ జిల్లావ్యాప్తంగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తమకు మాటమాత్రమైన చెప్పకుండా ఏకంగా సీఎంకు ఆహ్వానం ఎలా పంపుతారంటూ ఆ ఇద్దరు ప్రజాప్రతినిధులు ఈవోపై మండిపడినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి.
Yadagirigutta: ఆలయంలో ప్రొటోకాల్ సరిగా ఇవ్వడం లేదంటూ ఆ ఇద్దరిలో ఓ ప్రజాప్రతినిధి ఈవోతో ఇటీవలే గొడవ కూడా పడినట్టు తెలిసింది. చింతపండు స్కాంలో ఎవరిపైనా చర్యలు తీసుకోవద్దంటూ ఈవోను ఇటీవలే అధికార పార్టీకి చెందిన నాయకులు ఒత్తిళ్లు తెచ్చినట్టు ప్రచారం జరుగుతున్నది. ఇదేకాకుండా గుట్టపై యథేచ్ఛగా సాగుతున్న అక్రమ వసూళ్లు, స్కాంలు, రాజకీయ ఒత్తిళ్లను తట్టుకోలేక ఈవో రాజీనామా చేశారని చెప్పుకుంటున్నారు.
