YS Sunitha

YS Sunitha: వివేకా హత్య కేసుపై వైఎస్ సునీత కీలక వ్యాఖ్యలు..గొడ్డలిపోటును.. గుండెపోటుగా నమ్మించారు

YS Sunitha: వై.ఎస్. వివేకానందరెడ్డి హత్య కేసులో ఆయన కుమార్తె వై.ఎస్. సునీత రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో మరోసారి రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఇటీవల పులివెందులలో చోటు చేసుకుంటున్న కొన్ని సంఘటనలు తన తండ్రి హత్య జరిగినప్పటి పరిస్థితులను గుర్తుకు తెస్తున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కడప జిల్లా ఎస్పీని కలిసిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ, ఈ హత్య కేసుతో ముడిపడిన అనేక సంచలన విషయాలను వెల్లడించారు.

వివేకానందరెడ్డిపై గొడ్డలితో దాడి జరిగితే, దానిని గుండెపోటుగా చిత్రీకరించారని సునీత ఆరోపించారు. అంతేకాకుండా, పోలీసులను బెదిరించి క్రైమ్ సీన్‌ను తుడిచిపెట్టారని ఆమె స్పష్టం చేశారు. ఈ ఆరోపణలు ఆనాటి పరిస్థితులను మళ్లీ తెరపైకి తెచ్చాయి.

హత్య జరిగిన తర్వాత, కొందరు వ్యక్తులు ఒక లేఖను తీసుకొచ్చి, దానిపై ఆదినారాయణ రెడ్డి, సతీష్ రెడ్డి, బీటెక్ రవి చంపినట్లుగా సంతకం చేయమని తనను బలవంతం చేశారని సునీత వెల్లడించారు. అయితే, తాను ఎంత ఒత్తిడి ఉన్నా సంతకం చేయలేదని ఆమె తెలిపారు. ఆ సమయంలో వై.ఎస్. అవినాష్ రెడ్డి అనుచరులు పోలీసులను బెదిరించారని ఆమె ఆరోపించారు.

Also Read: Putin India Visit : రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ భారత పర్యటన.. త్వరలో

గత ఆరు సంవత్సరాలుగా ఈ కేసులో న్యాయం కోసం పోరాడుతున్నప్పటికీ దోషులకు ఇప్పటివరకు శిక్ష పడలేదని సునీత ఆవేదన వ్యక్తం చేశారు. తనపై, తన భర్త రాజశేఖర్ రెడ్డిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, వారు హత్య చేయించారని అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ఆమె మండిపడ్డారు.

ఇటీవల తమ బంధువు సురేష్పై జరిగిన దాడి వెనుక ఎంపీ అవినాష్ రెడ్డి అనుచరులు ఉన్నారని ఆమె అనుమానం వ్యక్తం చేశారు. ఈ పరిస్థితులు చూస్తుంటే ఎన్నికల సమయంలోనూ అదే తరహా బెదిరింపులు, అణచివేత జరుగుతున్నాయని ఆమె అన్నారు. న్యాయం కోసం పోరాడుతున్న తనకు, తన తల్లికి రక్షణ లేకుండా పోయిందని, సెక్యూరిటీ పెట్టుకుని తిరగాల్సిన పరిస్థితి వచ్చిందని ఆమె వాపోయారు.

వై.ఎస్. సునీత చేసిన ఆరోపణల నేపథ్యంలోనే కాకుండా, పులివెందులలో తాజాగా చోటు చేసుకున్న ఘటనల ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించి, అనుమతి లేకుండా పెద్ద సంఖ్యలో కార్యకర్తలతో ర్యాలీ నిర్వహించారని ఎంపీ వై.ఎస్. అవినాష్ రెడ్డి, సతీష్ రెడ్డిలపై కేసు నమోదైంది. ఈ కేసులతో వివేకానందరెడ్డి హత్య కేసు మళ్లీ ఎన్నికల వేళ కీలక అంశంగా మారింది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *