Nacharam: హైదరాబాద్లోని నాచారం మల్లాపూర్ ప్రాంతంలో ఒక దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. కేవలం తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే కోపంతో, కట్టుకున్న భర్తను ఓ భార్య తన ప్రియుడితో కలిసి అతి దారుణంగా అంతమొందించింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒడిశాకు చెందిన నారాయణ్ బెహరా, బంధిత బెహరా దంపతులు ఉపాధి కోసం నగరానికి వచ్చి మల్లాపూర్లో నివాసం ఉంటున్నారు.
నారాయణ్ బెహరా ప్లంబర్గా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తుండగా, అతని భార్య బంధిత ఇంట్లోనే ఉండేది. అయితే, అదే ఇంట్లో అద్దెకు ఉంటున్న విద్యాసాగర్ అనే వ్యక్తితో బంధితకు గత నాలుగు నెలలుగా పరిచయం ఏర్పడి, అది కాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది. వీరిద్దరి వ్యవహారం భర్తకు తెలియడంతో ఇంట్లో తరచూ గొడవలు జరుగుతుండేవి. తమ సంబంధానికి నారాయణ్ అడ్డు వస్తున్నాడని భావించిన ఆ ఇద్దరూ అతడిని వదిలించుకోవాలని ప్లాన్ చేశారు.
పథకం ప్రకారం, బంధిత తన ప్రియుడు విద్యాసాగర్తో కలిసి నారాయణ్పై ఇనుప రాడ్డుతో దాడి చేసింది. తీవ్రంగా కొట్టడంతో అతను అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న నాచారం పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతుడి బంధువుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు, భార్య ప్రవర్తనపై అనుమానం వచ్చి ఆమెను గట్టిగా ప్రశ్నించారు.
పోలీసుల విచారణలో బంధిత తన తప్పును ఒప్పుకుంది. ప్రియుడి మోజులో పడి భర్తను చంపినట్లు అంగీకరించింది. ఈ దారుణం జరిగిన కేవలం 24 గంటల లోపే పోలీసులు నిందితులైన బంధిత బెహరా మరియు విద్యాసాగర్లను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం ఒక ప్రాణాన్ని బలి తీసుకోవడమే కాకుండా, రెండు కుటుంబాలను రోడ్డున పడేసింది.
