Weather: ఉపరితల ద్రోణి ఛత్తీస్గఢ్ మరియు జార్ఖండ్ మీదుగా కొనసాగుతోంది. దీని ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వాతావరణం మారుతూ, కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. భారత వాతావరణ శాఖ (IMD) ప్రకారం, వచ్చే రెండు రోజుల పాటు తెలంగాణలో వర్షాలు కొనసాగనున్నాయి.
ఈ ద్రోణి ప్రభావంతో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీసే అవకాశం ఉంది. కొన్ని చోట్ల పిడుగులు పడే అవకాశమూ ఉన్నట్లు అధికారులు హెచ్చరించారు.
వర్షాల తీవ్రత దృష్టిలో పెట్టుకుని తెలంగాణలోని 14 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే మాత్రమే బయటకు రావాలని సూచించారు. వ్యవసాయ పనులు చేసేవారు, విద్యుత్ స్తంభాల దగ్గర ఉండేవారు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరికలు జారీ చేశారు.
వాతావరణ శాఖ అందించిన సమాచారం ప్రకారం, ఈ ప్రభావం మే 4, మే 5 తేదీల్లో ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా నల్లగొండ, ఖమ్మం, మహబూబాబాద్, సూర్యాపేట, జనగాం, వరంగల్, భద్రాద్రి కొత్తగూడెం వంటి జిల్లాల్లో వర్షపాతం ఎక్కువగా నమోదవుతుందని అంచనా.
