Weather Report: తెలంగాణ రాష్ట్రంలో మరోసారి వర్షాలు పలకరించనున్నాయి. వచ్చే మూడు రోజుల పాటు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం కీలక అప్డేట్ ఇచ్చింది. కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరించింది.
రుతుపవన ద్రోణి, ఉపరితల ఆవర్తన ప్రభావం
హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం, ప్రస్తుతం రుతుపవన ద్రోణి అమృత్సర్, డెహ్రాడూన్, షాజహాన్పూర్, వాల్మీకినగర్, చేపరా, జల్పాయిగురి మీదుగా అరుణాచల్ ప్రదేశ్ వరకు కొనసాగుతోంది. అలాగే, నైరుతి బంగాళాఖాతంలో ఉత్తర తమిళనాడు తీరం వద్ద సముద్రమట్టానికి 3.1 నుండి 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఒక ఉపరితల చక్రవాత ఆవర్తనం ఉంది.
ఇంకా, తూర్పు మధ్య అరేబియన్ సముద్రం నుంచి దక్షిణ అంతర్గత కర్ణాటక, తమిళనాడు మీదుగా మధ్య బంగాళాఖాతం వరకు ఒక ఉత్తర-దక్షిణ ద్రోణి కొనసాగుతోంది. ఈ వాతావరణ పరిస్థితుల ప్రభావంతో తెలంగాణలో వర్షాలు కురవనున్నాయి.
రాగల మూడు రోజులకు వాతావరణ సూచన:
సోమవారం (ఆగస్టు 4, 2025): రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
Also Read: WhatsApp Tricks: WhatsApp చాట్ను దాచాలనుకుంటున్నారా? ఐతే ఇలా చేయండి..
మంగళవారం (ఆగస్టు 5, 2025), బుధవారం (ఆగస్టు 6, 2025): రాష్ట్రంలోని చాలా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది.
వాతావరణ హెచ్చరికలు:
సోమవారం, మంగళవారం, బుధవారం: రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
ముఖ్యంగా, ఎల్లుండి (బుధవారం, ఆగస్టు 6, 2025) రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సంచాలకులు తమ ప్రకటనలో తెలిపారు.