Chandrababu Naidu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లా నగరిలో జరిగిన ‘స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమంలో పాల్గొని కీలక ప్రసంగం చేశారు. గత ఐదేళ్ల పాలనలో రాష్ట్రం అరాచకాలతో అతలాకుతలమైందని, సామాన్య ప్రజలు మాట్లాడాలన్నా, నవ్వాలన్నా భయపడే పరిస్థితి ఉండేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తనలాంటి సీనియర్ నాయకుడినే జైల్లో పెట్టిన విషయాన్ని గుర్తు చేస్తూ, ప్రజలు ఇప్పుడు సమర్థవంతమైన నాయకత్వాన్ని ఎన్నుకున్నారని కొనియాడారు.
రాష్ట్ర ఆర్థికాభివృద్ధిపై స్పందిస్తూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కేవలం 18 నెలల్లోనే రూ. 20 లక్షల కోట్ల పెట్టుబడులు ఏపీకి వచ్చాయని ముఖ్యమంత్రి వెల్లడించారు. భారతదేశంలోకి వచ్చిన మొత్తం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులలో (FDI) 25 శాతం ఒక్క ఆంధ్రప్రదేశ్కే రావడం మన సుపరిపాలనకు నిదర్శనమని ఆయన గర్వంగా చెప్పారు.
ఇది కూడా చదవండి: Cow Calf: అన్నమయ్య జిల్లాలో దారుణం.. ఆవు దూడపై మైనర్ల అఘాయిత్యం..!
అమరావతి రాజధానిపై క్లారిటీ ఇస్తూ.. ఎవరెన్ని కుట్రలు చేసినా అమరావతిని అడ్డుకోలేరని, ప్రపంచమే మెచ్చేలా రాజధానిని అభివృద్ధి చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. అభివృద్ధిని కేవలం ఒకే చోట కాకుండా అన్ని ప్రాంతాలకు వికేంద్రీకరణ చేస్తామని హామీ ఇచ్చారు.
పాలనలో పారదర్శకత గురించి మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం కరెంట్ ఛార్జీలు పెంచలేదని, విద్యుత్ కొనుగోలు ఖర్చులను తగ్గిస్తూ ప్రజలపై భారం పడకుండా చూస్తున్నామని చెప్పారు. అలాగే ‘సూపర్ సిక్స్’ పథకాలను ప్రభుత్వం విజయవంతంగా అమలు చేస్తోందని పేర్కొన్నారు. గత ప్రభుత్వం నగరాల్లో వదిలేసిన లక్షల టన్నుల చెత్త వల్ల భూగర్భ జలాలు, వాయు కాలుష్యం పెరిగిపోయాయని.. ఇప్పుడు ఆ చెత్తను తొలగించి స్వచ్ఛాంధ్రగా మారుస్తున్నామని వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లో పారిశుధ్యం కోసం కొత్తగా ఇ-ఆటోలు, ట్రై సైకిళ్లను పంపిణీ చేస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు.
