Guinness World Record: 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని విశాఖ నగరం చరిత్రలో నిలిచిపోయే ఘట్టానికి వేదికైంది. “యోగాంధ్ర 2025” పేరుతో నిర్వహించిన విభిన్న యోగా కార్యక్రమంలో ఏకంగా 3.20 లక్షలమంది ప్రజలు ఒకే సమయంలో పాల్గొని, ఒకే స్థలంలో యోగాసనాలు వేసి గిన్నిస్ వరల్డ్ రికార్డు సొంతం చేసుకున్నారు.
ఈ అద్భుత కార్యక్రమాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేశ్ పర్యవేక్షించారు. విశాఖ సముద్రతీరంలో ఆర్కే బీచ్ నుంచి భీమిలి దాకా విస్తరించిన ఈ యోగా సమిష్టి ప్రదర్శన 45 నిమిషాలపాటు అద్భుతంగా సాగింది.
గిన్నిస్ బుక్ ప్రతినిధుల సమక్షంలో ఈ రికార్డు అధికారికంగా ధృవీకరించబడింది. ఈ సందర్భంగా గిన్నిస్ ప్రతినిధులు ధృవపత్రాలను నారా లోకేశ్, సీఎస్ విజయానంద్లకు అందజేశారు.
ఈ కార్యక్రమం “యోగా ఫర్ వన్ ఎర్త్ – వన్ హెల్త్” నినాదంతో నిర్వహించబడింది. ఇది కేవలం యోగా ప్రదర్శన మాత్రమే కాదు, ప్రపంచానికి భారతీయ సంప్రదాయాన్ని గర్వంగా చూపించిన సాంస్కృతిక ఘట్టం కూడా.
ఇది కూడా చదవండి: Space tour: అంతరిక్ష యానానికి తొలి భారతీయురాలు మన తెలుగమ్మాయే..
2003లో గుజరాత్లోని సూరత్ నగరంలో స్థాపించిన యోగా రికార్డును అధిగమించి, ఇప్పుడు విశాఖపట్నం ప్రపంచ మేధావుల దృష్టిని ఆకర్షించింది. 3.01 లక్షల మందితో సూరత్ చేసిన రికార్డును మించి, విశాఖలో 3.20 లక్షలమంది యోగాసనాల్లో పాల్గొనడం గర్వకారణం.
ఈ కార్యక్రమం ద్వారా విశాఖపట్నం మాత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా ప్రపంచ యోగా పటములో గొప్ప స్థానాన్ని సంపాదించింది.
