Vijayasaireddy: మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి తన తాజా ట్వీట్తో రాజకీయ వర్గాల్లో చర్చకు తావిచ్చారు.”కోటలో రాజు బాగుండాలంటే జనంలోకి రావాలి, ప్రజల ఆకాంక్షలు అర్థం చేసుకోవాలి. లేకపోతే కోటరీ వదలదు.. కోట కూడా మిగలదు. ప్రజాస్వామ్యంలో అయినా జరిగేది ఇదే.”
ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఏదైనా నేతను ఉద్దేశించి ఈ ట్వీట్ చేశారా? లేక రాజకీయ వ్యవస్థలోని కొన్ని వ్యవహారాలపై వ్యంగ్యంగా స్పందించారా? అనే విషయంపై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ఇటీవల చోటుచేసుకున్న కొన్ని రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు ప్రత్యేకమైన ప్రాధాన్యతను కలిగి ఉన్నాయి. అతని ట్వీట్ వెనుక ఉన్న అసలు అర్థం ఏమిటనేదానిపై రాజకీయ విశ్లేషకులు వివిధ కోణాల్లో విశ్లేషిస్తున్నారు.
కాగా, ఆయన మొన్న చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఇటీవల తన రాజకీయ భవిష్యత్తుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ నుంచి బయటకు వచ్చేందుకు గల కారణాలను ఆయన వివరించారు. జగన్ చుట్టూ ఉన్న కోటరీ వల్లే తాను వైసీపీకి దూరమయ్యానని, ఇక తిరిగి పార్టీలో చేరే ప్రశ్నే లేదని స్పష్టంగా చెప్పారు.
కేవీ రావుతో తనకు ఎలాంటి సంబంధం లేదు
విజయసాయిరెడ్డి తనపై వచ్చిన ఆరోపణలను ఖండిస్తూ, “కేవీ రావుతో నాకు ఎలాంటి ఆర్థిక సంబంధాలు లేవు. ముఖపరిచయం తప్ప ఆయనతో నా మధ్య ఎలాంటి లావాదేవీలు జరగలేదు. అరబిందో వ్యాపారాల్లో కూడా నేను ఎప్పుడూ జోక్యం చేసుకోలేదు” అని తెలిపారు. విక్రాంత్ రెడ్డి గురించి మాట్లాడుతూ, “సుబ్బారెడ్డి కుమారుడిగా విక్రాంత్ రెడ్డిని నేను తెలుసు. కానీ, ఆయనను కేవీ రావుకు పరిచయం చేయాల్సిన అవసరం నాకు లేదు” అని స్పష్టం చేశారు.
కోటరీ వల్లే వైసీపీకి దూరం
పార్టీ వీడటానికి గల ప్రధాన కారణాన్ని వివరిస్తూ, విజయసాయిరెడ్డి ఇలా చెప్పారు: “మీ చుట్టూ ఉన్న కోటరీ మాటలు వింటే బాగుండదని జగన్కు చెప్పాను. కానీ, నేను పార్టీకి ప్రాధాన్యత కోల్పోయానని అనిపించింది. నా మనసు విరిగిపోయింది కాబట్టే పార్టీ నుంచి బయటకు వచ్చా. విరిగిన మనసు మళ్లీ అతుక్కోలేం” అని వ్యాఖ్యానించారు.
తిరిగి వైసీపీలో చేరే అవకాశమే లేదు
వైసీపీ నేతలు తనను తిరిగి పార్టీలో చేర్చాలని ప్రయత్నిస్తున్నారా అన్న ప్రశ్నకు విజయసాయిరెడ్డి స్పందిస్తూ, “జగన్ నన్ను పార్టీలో ఉండమన్నారు. కానీ, మళ్లీ వైసీపీ ఘర్ వాపసీ ఉండదు” అని తేల్చి చెప్పారు.
జగన్కు ఈ కేసుతో సంబంధం లేదు
ఇటీవల తనపై వచ్చిన ఆరోపణలపై స్పందిస్తూ, “ఈ కేసులో జగన్కు ఎలాంటి ప్రమేయం లేదు. కొందరు నాపై ఆరోపణలు చేస్తున్నారు, కానీ నేను ఎవరినీ మోసం చేయలేదు. నా నాయకుడు నేను ప్రలోభాలకు లొంగిపోయానని అన్నారు. కానీ, నిజానికి నేను ఎలాంటి ప్రలోభాలకు లొంగలేదు” అని విజయసాయిరెడ్డి స్పష్టంచేశారు.
ఈ వ్యాఖ్యలతో, విజయసాయిరెడ్డి వైసీపీకి పూర్తిగా దూరమైనట్లు స్పష్టమవుతోంది. ఆయన భవిష్యత్ రాజకీయ ప్రస్థానం ఎలా ఉంటుందో వేచిచూడాల్సిందే.