P.A Ranjith: ప్రముఖ దర్శకుడు పా.రంజిత్ దర్శకత్వంలో, నీలం ప్రొడక్షన్స్ బ్యానర్పై తెరకెక్కుతున్న ‘వెట్టువం’ చిత్రం షూటింగ్ సమయంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. తమిళనాడులోని నాగపట్నం జిల్లా కీజాయూర్ సమీపంలోని వేదమావడి గ్రామంలో జరుగుతున్న షూటింగ్లో స్టంట్ ట్రైనర్ మోహన్రాజ్ (52) గుండెపోటుతో మృతి చెందాడు. ఈ ఘటనపై కీజాయూర్ పోలీసులు పా.రంజిత్తో పాటు పలువురిపై కేసు నమోదు చేశారు.
ఘటన ఎలా జరిగింది?
కాంచీపురం జిల్లా పూంగండం సెల్లియమ్మన్ కోయిల్ స్ట్రీట్కు చెందిన మోహన్రాజ్, స్టంట్ ట్రైనర్గా చాన్నాళ్లుగా పనిచేస్తున్నారు. ‘వెట్టువం’ చిత్రంలో ఆర్య, దినేష్ తదితరులు నటిస్తున్నారు. జూలై 10 నుండి వేదమావడి గ్రామంలో షూటింగ్ జరుగుతోంది.
ఒక కారు ఛేజింగ్ సీన్ కోసం కారు పల్టీలు కొట్టే స్టంట్ చిత్రీకరిస్తుండగా, మోహన్రాజ్ కారు నుంచి దూకే సన్నివేశంలో పాల్గొన్నారు. కారు రెండు పల్టీలు కొట్టి ఆగిపోగా, మోహన్రాజ్ స్పృహ కోల్పోయారు. వెంటనే ఆయనను నాగపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు.
డాక్టర్ల ప్రకారం, మోహన్రాజ్ శరీరంపై గాయాలు ఏవీ లేవు. కారు పల్టీలు కొడుతున్న సమయంలో కలిగిన ఆందోళన, ఒత్తిడి వల్లే ఆయనకు గుండెపోటు వచ్చి మృతి చెందినట్లు ప్రాథమికంగా భావిస్తున్నారు.
నిర్లక్ష్యం ఆరోపణలు – కేసు నమోదు
ఈ ఘటనపై సీసీటీవీ ఫుటేజ్ బయటకు రావడంతో, సోషల్ మీడియాలో దర్శకుడు పా.రంజిత్పై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. “ఏఐ టెక్నాలజీ ఉన్నా ఇలాంటి రిస్కీ స్టంట్లు ఎందుకు చేస్తున్నారు?” అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
ఇది కూడా చదవండి: War 2: వార్ 2: ఆ సీన్స్ హైలెట్.. గూస్ బంప్స్ పక్కా అంటున్న నిర్మాత!
కీజాయూర్ పోలీసులు పా.రంజిత్, రాజ్కమల్, వినోద్, ప్రభాకరన్లపై నిర్లక్ష్యం కారణంగా మరణం సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. షూటింగ్ సమయంలో తగిన భద్రతా చర్యలు తీసుకోలేదని ఆరోపణలు వస్తున్నాయి.
విశాల్ స్పందన – కీలక విషయాల వెల్లడి
సౌతిండియన్ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ విశాల్, మోహన్రాజ్ మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
-
“రాజ్ నాకు 20 ఏళ్లుగా తెలుసు. ఆయనకి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆయన కుటుంబానికి సహాయం చేస్తాం” అని తెలిపారు.
-
అలాగే, “ఈ స్టంట్ చాలా రిస్క్తో కూడుకున్నది. స్టంట్ కొరియోగ్రాఫర్ దిలీప్ సుబ్బరాయన్ కూడా రాజ్కి చేయొద్దని చెప్పాడు. కానన్ బ్లాస్ట్ సాయంతో తానే పూర్తిచేస్తానని దిలీప్ చెప్పినా, రాజ్ మాత్రం తానే చేస్తానని పట్టుబట్టాడు” అని విశాల్ కీలక విషయాలు వెల్లడించారు.
సినీ ఇండస్ట్రీలో చర్చకు దారితీసిన ఘటన
మోహన్రాజ్ మృతి కోలీవుడ్ను కుదిపేసింది. సినిమాల్లో రిస్కీ స్టంట్లు తీయడం, భద్రతా చర్యలు పాటించకపోవడం పై పెద్ద చర్చ మొదలైంది. నెటిజన్లు పా.రంజిత్ అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.