Tollywood: టాలీవుడ్లో దర్శకులుగా గుర్తింపు తెచ్చుకున్న పలువురు కాలక్రమంలో నిర్మాతలుగా మారుతున్న సంగతి తెలిసిందే. తనదైన కామెడీ టైమింగ్, యూత్ఫుల్ కథలతో ప్రేక్షకులను అలరించిన దర్శకుడు వెంకీ కుడుముల ఇప్పుడు నిర్మాతగా కొత్త ప్రయాణానికి శ్రీకారం చుట్టారు.
‘వాట్ నెక్స్ట్ ఎంటర్టైన్మెంట్స్’ పేరుతో సొంత నిర్మాణ సంస్థను స్థాపించినట్లు వెంకీ కుడుముల అధికారికంగా ప్రకటించారు. ఈ బ్యానర్పై కొత్త నటీనటులు, సాంకేతిక నిపుణులతో తన తొలి చిత్రాన్ని నిర్మించనున్నారు.
ఈ విషయాన్ని ఆయన తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతా ద్వారా వెల్లడించారు. తన తొలి నిర్మాణ ప్రయత్నానికి సంబంధించిన వివరాలను కూడా పంచుకున్నారు. ఈ చిత్రానికి నూతన దర్శకుడు మహేశ్ ఉప్పల దర్శకత్వం వహించనుండగా, మలయాళ నటి అనస్వర రాజన్ హీరోయిన్గా నటిస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తుండగా, రాజా మహాదేవన్ సినిమాటోగ్రాఫర్గా వ్యవహరిస్తున్నారు.
ఈ సినిమా టైటిల్తో పాటు ఫస్ట్ లుక్ డిసెంబర్ 14న ‘#NewGuyInTown’ హ్యాష్ట్యాగ్తో విడుదల చేయనున్నట్లు వెంకీ కుడుముల తెలిపారు.
ఈ సందర్భంగా వెంకీ కుడుముల మాట్లాడుతూ,
“సినిమా అంటే నాకు అమితమైన ఇష్టం. ఈ రంగంలో నిలదొక్కుకోవడం ఎంత కష్టమో నాకు తెలుసు. అవకాశం కోసం ఎదురుచూస్తున్న కొత్త ప్రతిభావంతులకు, మంచి కథలకు ఒక వేదిక కల్పించాలనే ఉద్దేశంతోనే ‘వాట్ నెక్స్ట్ ఎంటర్టైన్మెంట్స్’ను ప్రారంభించాను. నా ద్వారా ఒక్కరికి అవకాశం దక్కినా అదే నాకు గొప్ప విజయం” అని అన్నారు.
వినోదాత్మక చిత్రాలే కాకుండా, పరిశ్రమకు కొత్త ఆలోచనలు, ప్రతిభను పరిచయం చేయాలనే లక్ష్యంతో వెంకీ కుడుముల ఈ నిర్మాణ సంస్థను స్థాపించినట్లు సినీ వర్గాలు భావిస్తున్నాయి.

