VC Sajjanar: దేశంలో పెరుగుతున్న ఆన్లైన్ బెట్టింగ్, గేమింగ్ యాప్స్ దుష్ప్రభావాలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అక్రమార్కులకు లాభాలు, అమాయక యువకులకు నష్టం తెచ్చిపెడుతున్న ఈ యాప్స్పై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు మంగళవారం కేంద్ర మంత్రివర్గం కొత్త బిల్లుకు ఆమోదం తెలిపింది. ఈ బిల్లును త్వరలోనే లోక్సభలో ప్రవేశపెట్టనున్నారు.
కేంద్ర బిల్లులోని కీలక అంశాలు
-
ఆన్లైన్ బెట్టింగ్ లేదా డబ్బులు పెట్టి ఆడే గేమ్స్లో పాల్గొంటే భారీ జరిమానాలు.
-
నిబంధనలు ఉల్లంఘించే యాప్లను నేరుగా నిషేధం.
-
సెలబ్రిటీలు ఈ యాప్స్కు ప్రచారం చేస్తే వారిపై కూడా చట్టపరమైన చర్యలు.
వీసీ సజ్జనార్ స్పందన
కేంద్ర నిర్ణయంపై టీజీఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్, సీనియర్ ఐపీఎస్ అధికారి వీసీ సజ్జనార్ హర్షం వ్యక్తం చేశారు. దీనిని ఆయన “చారిత్రాత్మక అడుగు”గా అభివర్ణిస్తూ, సమాజాన్ని జూద వ్యసనం నుండి కాపాడే గొప్ప నిర్ణయమని ట్వీట్ చేశారు.
ఇది కూడా చదవండి: Afghanistan: బస్సులో మంటలు.. 71 మంది మృతి.. అందులో 17 మంది చిన్నపిల్లలే
“భారత యువత బంగారు భవిష్యత్తు కోసం ఈ నిషేధం ఎంతో మేలుచేస్తుంది. మానసిక, ఆర్థిక బానిసత్వం నుండి యువతను బయటపడేసే ఈ చట్టం సమాజాన్ని ఆరోగ్యకర దిశగా నడిపిస్తుంది. యువకులారా..! ఇకనైనా బెట్టింగ్ యాప్స్ దరిదాపుల్లోకి వెళ్లకండి. మీ ప్రతిభను విద్య, కెరీర్, సృజనాత్మకతపై వినియోగించి భవిష్యత్తును నిర్మించుకోండి,” అని సజ్జనార్ పిలుపునిచ్చారు.
అమలు సవాళ్లు
ఈ యాప్స్ ఇప్పటికే దేశవ్యాప్తంగా వేలాది మందిని ఆర్థికంగా కూలదోసినట్లు, ఎన్నో కుటుంబాలను నాశనం చేసినట్లు సజ్జనార్ గుర్తుచేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లలో నిషేధం అమలులో ఉన్నప్పటికీ, అవి మరో మార్గంలో మళ్లీ ప్రజలకు అందుబాటులోకి వస్తున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
కిందిస్థాయి పోలీసు అధికారులకు ఈ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయడానికి తగిన అధికారం ఇవ్వాలని సజ్జనార్ సూచించారు. “ఈసారి మాత్రం కఠిన చర్యలు తీసుకుని, నిర్వాహకులకు ఎలాంటి అవకాశం ఇవ్వకూడదు. సమాజ రక్షణ కోసం కఠిన చట్టాలు, కఠిన అమలు తప్పనిసరి” అని ఆయన స్పష్టం చేశారు.

