Vangalapudi Anitha: ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత ప్రస్తుత ప్రతిపక్ష పార్టీ వైసీపీపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. వైసీపీ బాధ్యత లేని ప్రతిపక్షంగా మారిందని ఆమె మండిపడ్డారు. ముఖ్యంగా చిన్న పిల్లల చేత “రప్పా రప్పా” అంటూ ఫ్లెక్సీలు కట్టించడం ఏంటని ఆమె ప్రశ్నించారు. మేకల తలలు నరికి, రక్తంతో అభిషేకాలు చేయిస్తూ సమాజంలో నేర ప్రవృత్తిని పెంచుతున్నారని ఆమె ఆరోపించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడటం ఒక ఎత్తైతే, ఇలాంటి రౌడీ మూకలను అదుపు చేయడం పోలీసులకు పెద్ద సవాలుగా మారిందని ఆమె పేర్కొన్నారు.
గత ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్ గంజాయికి అడ్డాగా మారిందని, కానీ ఇప్పుడు తమ ప్రభుత్వం రాష్ట్రాన్ని గంజాయి రహితంగా మార్చేందుకు గట్టి చర్యలు తీసుకుంటోందని అనిత తెలిపారు. దీని కోసం ప్రత్యేకంగా ‘ఈగల్ టీమ్’ను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. గతంలో జగన్ గంజాయిని అరికట్టేందుకు కనీసం ఒక్క కార్యక్రమానికైనా హాజరయ్యారా? అని ఆమె నిలదీశారు. ప్రస్తుతం గంజాయి సాగును పూర్తిగా తగ్గించామని, రవాణా చేసే వారిపై కఠినమైన కేసులు పెడుతున్నామని స్పష్టం చేశారు.
ఇక వైసీపీ నాయకులపై తాము ఎలాంటి కక్ష సాధింపులకు పాల్పడటం లేదని హోంమంత్రి స్పష్టం చేశారు. “మేము నిజంగా కక్ష కట్టి ఉంటే, వైసీపీ నేతలు ఇప్పుడు రోడ్డుపై స్వేచ్ఛగా తిరిగేవారా?” అని ఆమె ప్రశ్నించారు. గత ప్రభుత్వంలో కనీసం ఒక్క కానిస్టేబుల్ ఉద్యోగం కూడా ఇవ్వలేదని, తాము బాధ్యతాయుతంగా పనిచేస్తూ వ్యవస్థలను చక్కదిద్దుతున్నామని చెప్పారు. పీపీపీ విధానంలో పనిచేసే వారిని అరెస్ట్ చేస్తామన్న జగన్ హెచ్చరికలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని, రాబోయే రోజుల్లో కూడా ప్రజలు వారికి తగిన బుద్ధి చెబుతారని ఆమె విమర్శించారు.
