Trump Tariffs: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ దేశాలపై విధించిన వివాదాస్పద టారిఫ్ల (సుంకాలు) విషయంలో భారీ మలుపు చోటుచేసుకుంది. అత్యవసర అధికారాలను (IEEPA) అడ్డగోలుగా వాడుతూ ట్రంప్ విధించిన టారిఫ్లను అమెరికా సుప్రీంకోర్టు శుక్రవారం కొట్టివేసింది. ఈ తీర్పుతో భారత ఎగుమతిదారులకు భారీ ఊరట లభించడమే కాకుండా, భారత్-అమెరికా మధ్య కుదిరిన మధ్యంతర వాణిజ్య ఒప్పందంలోనూ (Interim Trade Deal) కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి.
సుప్రీంకోర్టు తీర్పు – ట్రంప్ స్పందన
అమెరికా సుప్రీంకోర్టు 6-3 మెజారిటీతో ట్రంప్ టారిఫ్లను రాజ్యాంగ విరుద్ధమని తేల్చింది. పన్నులు విధించే అధికారం కాంగ్రెస్కు మాత్రమే ఉంటుందని, అధ్యక్షుడు స్వతహాగా ఇలాంటి నిర్ణయాలు తీసుకోలేరని స్పష్టం చేసింది.
ఈ తీర్పును ట్రంప్ తీవ్రంగా విమర్శించారు. దీనిని “దేశానికి అవమానం” అని అభివర్ణిస్తూనే, తన వాణిజ్య అజెండాను ఆపేది లేదని ప్రకటించారు.
సుప్రీం తీర్పును అధిగమించేందుకు ‘ట్రేడ్ యాక్ట్ 1974’ లోని సెక్షన్ 122 కింద 10 శాతం అంతర్జాతీయ టారిఫ్ను తక్షణమే విధిస్తూ ట్రంప్ మరో కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేశారు.
భారత్కు కలిగే ప్రయోజనం ఏంటి?
గతంలో భారత్పై సుమారు 25 శాతం నుండి 50 శాతం వరకు టారిఫ్లు ఉండేవి. ఇటీవల కుదిరిన ఒప్పందంలో దానిని 18 శాతానికి తగ్గించారు. అయితే, తాజా సుప్రీంకోర్టు తీర్పు మరియు ట్రంప్ కొత్త ఉత్తర్వుల నేపథ్యంలో భారత్ ఎదుర్కోవాల్సిన సుంకం మరింత తగ్గింది.
వైట్ హౌస్ విడుదల చేసిన సమాచారం ప్రకారం, భారత్ సహా ఇతర వాణిజ్య భాగస్వాములు ఇకపై 10 శాతం సుంకాన్ని మాత్రమే ఎదుర్కోవాల్సి ఉంటుంది.
భారత్-అమెరికా మధ్య కుదిరిన డీల్లో ఇది ఒక ముఖ్యమైన మార్పు. భారత ఎగుమతులు, ముఖ్యంగా టెక్స్టైల్స్, జ్యువెలరీ మరియు ఐటీ ఉత్పత్తులకు అమెరికా మార్కెట్లో మరింత వెసులుబాటు లభించనుంది.
