Ram Mohan Naidu: తెలంగాణలోని ఉత్తర జిల్లా వాసులకు త్వరలో విమాన ప్రయాణం అందుబాటులోకి రానుంది. ఆదిలాబాద్లో దేశంలోనే ఒక అతిపెద్ద విమానాశ్రయాన్ని నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. ఇటీవల ఢిల్లీలో కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, అశ్వినీ వైష్ణవ్, కిషన్ రెడ్డిలతో కలిసి ఆయన ఈ ప్రాజెక్టుపై కీలక చర్చలు జరిపారు.
ఆదిలాబాద్లో విమానాశ్రయం ఏర్పాటుకు అన్ని రకాల అనుకూలతలు ఉన్నాయని మంత్రి స్పష్టం చేశారు. అక్కడ ఇప్పటికే రక్షణ శాఖకు చెందిన 300 ఎకరాల భూమి సిద్ధంగా ఉంది. ఈ భూమిని అటు సైనిక అవసరాలకు, ఇటు సాధారణ ప్రజల విమాన ప్రయాణాలకు కలిపి ఉపయోగించుకునేలా ‘జాయింట్ వెంచర్’ పద్ధతిలో అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. దీనికోసం రక్షణ శాఖ కూడా సానుకూలంగా స్పందించడం గమనార్హం.
ఈ ప్రాజెక్టు పట్టాలెక్కాలంటే రాష్ట్ర ప్రభుత్వం మరో 450 ఎకరాల భూమిని సేకరించి ఇవ్వాల్సి ఉంటుంది. భూసేకరణ విషయంలో ఎలాంటి ఇబ్బందులు రావని స్థానిక నాయకులు భరోసా ఇస్తున్నారు. క్షేత్రస్థాయిలో పరిస్థితిని పరిశీలించేందుకు ఈ నెల 17వ తేదీన అధికారుల బృందం ఆదిలాబాద్లో పర్యటించనుంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే, ఆదిలాబాద్ రూపురేఖలు మారిపోవడమే కాకుండా ఆర్థికంగా ఆ ప్రాంతం ఎంతో వృద్ధి చెందుతుంది.
ఆదిలాబాద్తో పాటు తెలంగాణలోని మరికొన్ని ప్రాంతాలపై కూడా కేంద్రం దృష్టి సారించింది. వరంగల్లోని మామునూరు ఎయిర్పోర్టుకు వచ్చే మూడు నెలల్లోనే శంకుస్థాపన చేసే అవకాశం ఉందని మంత్రి తెలిపారు. అలాగే కొత్తగూడెం మరియు పెద్దపల్లి జిల్లా అంతర్గాం వద్ద విమానాశ్రయాల ఏర్పాటు ప్రతిపాదనలను కూడా ప్రభుత్వం పరిశీలిస్తోంది. విమాన ప్రయాణాన్ని సామాన్యులకు కూడా అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతోనే ఈ అడుగులు వేస్తున్నట్లు మంత్రి వివరించారు.
