Pankaj Chaudhary: ఉత్తర్ ప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడిగా పంకజ్ చౌధరీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు. లఖ్ నవూలో జరిగిన కార్యక్రమంలో ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ , ఉపముఖ్యమంత్రులు కేశవ్ ప్రసాద్ మౌర్యా, బ్రజేష్ పాఠక్ పాల్గొన్నారు. అధ్యక్షుడి పదవి కోసం శనివారం పంకజ్ చౌధరీ నామినేషన్ దాఖలు చేశారు. ఆయన ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో ఎన్నిక ఏకగ్రీవమైంది. మహారాజ్ గంజ్ నియోజకవర్గం నుంచి పంకజ్ ఏడు సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు.
కుర్మీ వర్గానికి చెందిన ఆయన…ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్ లకు సన్నిహితుడిగా పేరుంది. ఉత్తరప్రదేశ్లో యాదవుల తర్వాత కుర్మీలు రెండవ అతిపెద్ద ఓబీసీ (నాన్-యాదవ్) ఓటు బ్యాంకుగా ఉన్నారు. ఈ నియామకం రాష్ట్రంలో కీలకమైన నాన్-యాదవ్ ఓబీసీ వర్గాన్ని ఏకీకృతం చేసే వ్యూహంలో భాగమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇది కూడా చదవండి: BRS: ఈనెల 19న కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ కీలక సమావేశం
ఈ నిర్ణయం ద్వారా సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) అనుసరిస్తున్న ‘పీడీఏ’ (పిచడా, దళిత, అల్పసంఖ్యాక్-వెనుకబడిన, దళిత, మైనారిటీ) రాజకీయ వ్యూహానికి కళ్లెం వేయాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. పదవిని స్వీకరించిన అనంతరం పంకజ్ చౌధరీ మాట్లాడుతూ, పార్టీ తనకు అప్పగించిన బాధ్యతను పూర్తి నిబద్ధతతో నిర్వహిస్తానని తెలిపారు.
