Uddhav Thackeray: ఆసియా కప్లో భాగంగా రేపు (ఆదివారం) జరగనున్న భారత్–పాకిస్థాన్ మ్యాచ్ దేశంలో పెద్ద వివాదానికి దారితీసింది. ఐదు నెలల క్రితం పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది మృతిచెందిన ఘటన మరువకముందే ఈ మ్యాచ్ జరుగుతోందని విపక్షాలు, బాధితుల కుటుంబాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. దేశభక్తి కంటే వ్యాపారాన్ని ప్రాధాన్యం ఇస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు.
ప్రతిపక్షాలు ఈ అంశంపై ముప్పేట దాడి చేస్తూ నిరసనలు చేపట్టాయి. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు పాకిస్థాన్ దిష్టిబొమ్మ దహనం చేసి వ్యతిరేకత తెలిపారు. మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం చేసే క్లబ్బులు, రెస్టారెంట్లను బహిష్కరించాలని ఆప్ నేత సౌరభ్ భరద్వాజ్ పిలుపునిచ్చారు. “మన సోదరీమణుల సిందూరాన్ని తుడిచిన వారితో మన ప్రభుత్వం క్రికెటర్లను ఆడిస్తోంది” అని ఆయన మండిపడ్డారు.
శివసేన (యూబీటీ) అధినేత ఉద్ధవ్ థాకరే కూడా తీవ్రస్థాయిలో స్పందించారు. “రక్తం, క్రికెట్ రెండూ ఎలా కలిసి సాగుతాయి? యుద్ధం, క్రికెట్ ఒకేసారి సాధ్యమా? వీరు దేశభక్తిని వ్యాపారంగా మార్చేశారు” అని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ మసూద్ మాట్లాడుతూ, “ప్రభుత్వం డబ్బు కోసం వీరమరణాలు పొందిన కుటుంబాలను పట్టించుకోవడం లేదు” అని ఆరోపించారు. మహారాష్ట్ర మజ్లిస్ పార్టీ నేత వారిస్ పఠాన్, “పాక్ తీవ్రవాదానికి మద్దతు ఇస్తోంది. అందుకే మ్యాచ్ చూడమని మా నిర్ణయం” అన్నారు.
ఇది కూడా చదవండి: Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కీలక కామెంట్స్
కేంద్ర క్రీడల శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ ఈ విమర్శలకు సమాధానమిస్తూ, “ఇది ద్వైపాక్షిక సిరీస్ కాదు. ఐసీసీ, ఏసీసీ నిర్వహించే బహుళ దేశాల టోర్నమెంట్లలో పాల్గొనడం తప్పనిసరి. ఆడకపోతే పాయింట్లు పాకిస్థాన్కి వెళ్ళిపోతాయి. ఉగ్రవాదం ఆగేంత వరకు పాక్తో ద్వైపాక్షిక సిరీస్లు ఆడబోమనే విధానంలో భారత్ దృఢంగానే ఉంది” అని స్పష్టం చేశారు.
జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కూడా స్పందిస్తూ, “బహుళ దేశాల టోర్నీలలో పాక్తో ఆడటంలో ఎప్పుడూ సమస్య లేదు. కానీ క్రీడలు తరచూ రాజకీయాలకు బలవుతుంటాయి” అన్నారు.
ఆసియా కప్ 2025లో భాగంగా ఈ హై-వోల్టేజ్ భారత్–పాక్ పోరు రేపు రాత్రి 8 గంటలకు ప్రారంభం కానుంది.