Trump

Trump: మోదీకి తెలుసు నేను సంతోషంగా లేనని: ట్రంప్

Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి భారత్‌పై తన అసహనాన్ని వ్యక్తం చేశారు. రష్యా నుంచి ముడి చమురు దిగుమతులను కొనసాగిస్తున్న నేపథ్యంలో, భారత్‌పై మరిన్ని వాణిజ్య సుంకాలను పెంచుతామని ఆయన తాజాగా హెచ్చరించారు. వెనిజులా పరిణామాల గురించి ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలో విలేకరులతో మాట్లాడుతున్న సమయంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

మోదీపై ప్రశంసలు.. విధానాలపై ఆగ్రహం
ప్రధాని నరేంద్ర మోదీని ‘చాలా మంచి వ్యక్తి’ అని కొనియాడుతూనే, రష్యా విషయంలో భారత్ అనుసరిస్తున్న తీరు పట్ల తాను ఏమాత్రం సంతోషంగా లేనని ట్రంప్ స్పష్టం చేశారు. ప్రధాని మోదీకి నా అసంతృప్తి గురించి స్పష్టమైన అవగాహన ఉందని, అమెరికా ప్రయోజనాలను గౌరవిస్తూ నన్ను మెప్పించడం వారికి ఎంతో అవసరమని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఒకవేళ భారత్ తన మొండివైఖరిని వీడకుండా రష్యాతో చమురు వ్యాపారాన్ని కొనసాగిస్తే, ప్రస్తుతం ఉన్న సుంకాలను మరింత వేగంగా పెంచుతామని ఆయన హెచ్చరించారు.

ట్రంప్ రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత భారత్‌పై ఇప్పటికే భారీగా సుంకాలను విధించారు. తొలుత సాధారణ వాణిజ్య కారణాలతో 25 శాతం సుంకం విధించగా, రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు జరిమానాగా మరో 25 శాతాన్ని అదనంగా చేర్చారు. దీంతో భారత్ నుంచి అమెరికాకు వెళ్లే అనేక ఉత్పత్తులపై మొత్తం 50 శాతం భారం పడింది. దీనివల్ల వస్త్రాలు, రత్నాలు, ఆభరణాలు, రసాయన రంగాలకు చెందిన ఎగుమతులు తీవ్రంగా దెబ్బతిన్నాయి.

Also Read: Venezuela: వెనెజువెలా తాత్కాలిక అధ్యక్షురాలిగా డెల్సీ రోడ్రిగ్జ్!

అమెరికాలోని ఆర్థిక, దౌత్య నిపుణులు ట్రంప్ నిర్ణయాలను తప్పుబడుతున్నారు. భారత్‌పై ఇలాంటి కఠినమైన ఆంక్షలు విధిస్తే దశాబ్దాల కాలంగా కొనసాగుతున్న మిత్రబంధం దెబ్బతింటుందని, ఇది అమెరికా ప్రయోజనాలకు కూడా నష్టమేనని వారు హెచ్చరిస్తున్నారు. అయినప్పటికీ, రష్యాకు వెళ్లే నిధులను అడ్డుకోవడమే లక్ష్యంగా ట్రంప్ భారత్‌ను లక్ష్యంగా చేసుకుంటున్నారు.

అమెరికా ఎన్ని హెచ్చరికలు చేసినా, భారత్ మాత్రం తన ఇంధన భద్రతకే ప్రాధాన్యత ఇస్తోంది. రష్యా నుంచి తక్కువ ధరకు చమురు లభిస్తుండటంతో, దేశ ప్రజల ప్రయోజనాల దృష్ట్యా ఆ కొనుగోళ్లను ఆపే ప్రసక్తే లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇటీవల రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత పర్యటనలో కూడా ఇరు దేశాలు చమురు సరఫరాను మరింత పెంచుకోవాలని నిర్ణయించుకున్నాయి. మరోవైపు చైనాతో కూడా భారత్ సంబంధాలు మెరుగుపడుతుండటం ట్రంప్‌కు మింగుడుపడటం లేదు. వరుసగా పెరుగుతున్న ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో, రానున్న రోజుల్లో భారత్-అమెరికా మధ్య వాణిజ్య సంబంధాలు ఏ మలుపు తిరుగుతాయోనన్నది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *