Hyd-Dog Dhadi : హైదరాబాద్ నగరంలోని మధురానగర్ ఏరియాలో ఒక విషాద ఘటన చోటు చేసుకుంది. 35 ఏళ్ల వయస్సున్న పవన్ కుమార్ అనే యువకుడు తన నివాసంలో అనుమానాస్పద స్థితిలో మరణించి కనిపించాడు. అతను ఒక నగల దుకాణంలో క్యాషియర్గా పనిచేస్తూ.. ఒంటరిగా ఉంటున్నాడు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న పవన్ గుండెపోటుతో మరణించి ఉంటాడని తొలుత భావించారు.
అయితే.. అతని మృతదేహాన్ని పరిశీలించిన వారికి దిగ్భ్రాంతి కలిగించే దృశ్యం కనిపించింది. అతని మర్మాంగాల వద్ద అతని పెంపుడు కుక్క కరిచినట్లుగా స్పష్టమైన గుర్తులు ఉన్నాయి. పక్కనే ఉన్న కుక్క నోటికి కూడా రక్తపు మరకలు అంటుకుని ఉండటంతో ఇది మరింత అనుమానాలకు తావిచ్చింది.
పవన్ కుమార్ స్వస్థలం ఏపీలోని కృష్ణా జిల్లా గుడివాడ. ఐదేళ్ల క్రితం భార్యతో విడాకులు తీసుకున్నప్పటి నుండి మధురానగర్లోని ఒక అపార్ట్మెంట్లో ఒంటరిగా నివసిస్తున్నాడు. ఒంటరితనాన్ని అధిగమించడం కోసం సైబీరియన్ హస్కీ జాతికి చెందిన ఒక కుక్కను అతడు ఎంతో ప్రేమతో పెంచుకుంటున్నాడు. పవన్ స్నేహితుడు సందీప్ అతని ఇంటికి వచ్చాడు. ఎన్నిసార్లు తలుపు కొట్టినా పవన్ తీయకపోవడంతో సందీప్కు అనుమానం వచ్చింది.
Hyd-Dog Dhadi: వెంటనే అతను ఇరుగుపొరుగు వారిని పిలిచి తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లారు. లోపల పవన్ అప్పటికే మరణించి ఉండటం చూసి వారు షాక్కు గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో.. వారు ఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులు అనుమానాస్పద మరణంగా కేసు నమోదు చేసుకున్నారు. క్లూస్ టీమ్ను రప్పించి అక్కడ లభించిన ఆధారాలను సేకరించారు. అనంతరం పవన్ మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు.
Also Read: Crime News: సంగారెడ్డి జిల్లాలో దారుణం.. భార్య వదిలేసి వెళ్లిందని మనస్తాపం
పోలీసులు ఈ ఘటనపై పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న పవన్ గుండెపోటుతో మరణించి ఉండవచ్చని వారు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. పవన్ ఎంతసేపటికీ లేవకపోవడంతో అతనిని నిద్రలేపడానికి ప్రయత్నించిన పెంపుడు కుక్క పొరపాటున అతని మర్మాంగాలను కొరికి ఉండవచ్చని కూడా వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
కానీ.. అతడి మరణానికి కారణం ఏంటనేది.. పోస్ట్మార్టం నివేదిక వచ్చిన తర్వాతే తెలుస్తుందని ఎస్సై శివ శంకర్ తెలిపారు. మధురానగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని అన్ని కోణాల్లోనూ లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.