Traffic Restrictions: మెహిదీపట్నం వాసులకు మరియు ఆ మార్గంలో ప్రయాణించే వాహనదారులకు ముఖ్య గమనిక. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న మెహిదీపట్నం స్కైవాక్ నిర్మాణ పనులు వేగవంతం కావడంతో, హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కీలక ఆంక్షలు విధించారు. నేటి నుండి డిసెంబర్ 21 వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయని అధికారులు స్పష్టం చేశారు.
ఎక్కడ మూసివేత?
స్కైవాక్ నిర్మాణంలో భాగంగా రేతిబౌలి జంక్షన్ నుండి ఎస్డీ (SD) కంటి ఆసుపత్రి వరకు రోడ్డు మార్గాలను తాత్కాలికంగా మూసివేయనున్నారు. ముఖ్యంగా పీవీఎన్ఆర్ ఎక్స్ప్రెస్ వే పిల్లర్ నంబర్ 1 నుండి పిల్లర్ నంబర్ 40 వరకు ప్రయాణించే వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకోవాలని పోలీసులు సూచించారు.
ఇది కూడా చదవండి: IND vs SA: ఐదవ టీ20లో భారత్ భారీ స్కోర్
ప్రత్యామ్నాయ మార్గాలు ఇవే:
ట్రాఫిక్ రద్దీని దృష్టిలో ఉంచుకుని పోలీసులు సూచించిన దారులు ఇక్కడ ఉన్నాయి:
- అత్తాపూర్ నుండి బంజారాహిల్స్ వైపు: రేతిబౌలి, నానల్ నగర్ జంక్షన్, ఫిల్మ్ నగర్ మీదుగా బంజారాహిల్స్ చేరుకోవచ్చు.
- అత్తాపూర్ నుండి నాంపల్లి వైపు: గుడి మల్కాపూర్, యాదవ్ భవన్, మిరాజ్ కేఫ్ జంక్షన్ (రైట్ టర్న్), ఆసిఫ్ నగర్, మల్లేపల్లి మీదుగా నాంపల్లికి వెళ్లాలి.
- టోలిచౌకి నుండి నాంపల్లి/లక్డీకాపూల్ వైపు: నానల్ నగర్ జంక్షన్, బాలికా భవన్, లక్ష్మీనగర్ మీదుగా పిల్లర్ నంబర్ 68 వద్దకు చేరుకోవాలి.
అక్కడ నుండి పిల్లర్ నంబర్ 57 వద్ద యూ-టర్న్ తీసుకుని.. గుడి మల్కాపూర్, యాదవ్ భవన్, మిరాజ్ కేఫ్ జంక్షన్, ఆసిఫ్ నగర్, మల్లేపల్లి మీదుగా లక్డీకాపూల్ చేరుకోవచ్చు.
స్కైవాక్ పనుల కారణంగా జంక్షన్ల వద్ద రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ప్రయాణికులు తమ ప్రయాణ సమయాన్ని కాస్త ముందుగా ప్లాన్ చేసుకోవాలని, ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.
