Tirumala: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారికి తెలంగాణ బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి భారీ విరాళం సమర్పించారు. మంగళవారం ఆయన సుమారు రూ.60 లక్షల విలువైన అపూర్వమైన స్వర్ణాభరణాన్ని శ్రీవారికి కానుకగా సమర్పించారు.
ఈ విషయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఛైర్మన్ బీఆర్ నాయుడు ఒక ప్రకటనలో వెల్లడించారు. ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి 535 గ్రాముల బరువైన “అష్టలక్ష్మి చంద్రవంక కంఠి” అనే విలువైన కంఠాభరణాన్ని సమర్పించినట్లు ఆయన తెలిపారు.
తిరుమలలోని రంగనాయకుల మండపంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఈ విరాళాన్ని అధికారికంగా స్వీకరించారు. ఈ సందర్భంగా టీటీడీ అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరితో కలిసి, ఛైర్మన్ బీఆర్ నాయుడు ఆ స్వర్ణాభరణాన్ని స్వీకరించినట్లు సమాచారం.