TTD: కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) శుభవార్త అందించింది. శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించి సుప్రభాతం, తోమల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవల మే నెల కోటాను ఫిబ్రవరి 18న ఉదయం 10 గంటలకు టీటీడీ అధికారిక ఆన్లైన్ పోర్టల్లో విడుదల చేయనుంది.
ఈ సేవా టికెట్ల కోసం లక్కీ డిప్ రిజిస్ట్రేషన్ ఫిబ్రవరి 18 నుంచి 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్లైన్లో అందుబాటులో ఉంటుంది. లక్కీ డిప్లో ఎంపికైన భక్తులు ఫిబ్రవరి 20 నుంచి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటలలోపు డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది.
అదేవిధంగా, కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవా టికెట్ల మే నెల కోటాను ఫిబ్రవరి 21న ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నట్లు టీటీడీ తెలిపింది.
మిగతా సేవల కోటా విడుదల తేదీలు:
✔ వర్చువల్ సేవలు & దర్శన స్లాట్లు – ఫిబ్రవరి 21న మధ్యాహ్నం 3 గంటలకు
✔ అంగప్రదక్షిణం టోకెన్లు – ఫిబ్రవరి 22న ఉదయం 10 గంటలకు
✔ శ్రీవాణి ట్రస్టు టికెట్లు – ఫిబ్రవరి 22న ఉదయం 11 గంటలకు
✔ వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారికి ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్లు – ఫిబ్రవరి 22న మధ్యాహ్నం 3 గంటలకు
మే నెల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు & గదుల కోటా
మే నెల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను ఫిబ్రవరి 24న ఉదయం 10 గంటలకు టీటీడీ విడుదల చేయనుంది. అలాగే, తిరుమల, తిరుపతి గదుల కోటాను ఫిబ్రవరి 24న మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనున్నట్లు వెల్లడించింది.
భక్తులు ttdevasthanams.ap.gov.in వెబ్సైట్ ద్వారా మాత్రమే శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలని టీటీడీ సూచించింది.