Revanth Reddy

Revanth Reddy: తెలంగాణలో హింసకు తావులేదు.. మావోయిస్టులకు సీఎం రేవంత్ రెడ్డి పిలుపు

Revanth Reddy: తెలంగాణ గడ్డపై హింసకు ఏమాత్రం చోటులేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఆయుధాల ద్వారా దేన్నీ సాధించలేమని, చర్చల ద్వారానే సమస్యలు పరిష్కారమవుతాయని ఆయన పేర్కొన్నారు. బంజారాహిల్స్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి సమక్షంలో సుమారు 130 మంది మావోయిస్టులు ప్రభుత్వానికి లొంగిపోయారు. ఈ సందర్భంగా పోలీసు యంత్రాంగాన్ని అభినందించిన సీఎం, అడవి బాట పట్టిన వారు జనజీవన స్రవంతిలోకి వచ్చేలా పోలీసులు నమ్మకాన్ని కలిగించారని కొనియాడారు.

గాంధీజీ చూపిన అహింసా మార్గంలోనే బ్రిటీషర్లను ఎదిరించి మనం స్వాతంత్ర్యం సాధించుకున్నామని సీఎం గుర్తు చేశారు. నేడు అణ్వాయుధాలు ఉన్న దేశాలు కూడా యుద్ధాల కంటే చర్చలకే ప్రాధాన్యత ఇస్తున్నాయని ఆయన ఉదహరించారు. అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులు కూడా తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని, ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజలతో కలిసి పనిచేయాలని విజ్ఞప్తి చేశారు. మావోయిస్టు నేతల డిమాండ్ల గురించి తాను కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో కూడా చర్చించానని, లొంగిపోయిన వారికి మెరుగైన జీవితాన్ని అందించేందుకు కేంద్రం కూడా సానుకూలంగా ఉందని తెలిపారు.

ఒకేసారి ఇంత పెద్ద సంఖ్యలో మావోయిస్టులు లొంగిపోవడం దేశంలోనే ఇదే తొలిసారి అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. మావోయిస్టు పార్టీ కీలక నేత గణపతి కూడా త్వరలోనే లొంగిపోవాలని ఆయన కోరారు. అలా వచ్చే వారికి ప్రభుత్వం పూర్తి రక్షణ కల్పిస్తుందని హామీ ఇచ్చారు. సొంత గ్రామాల్లో ఇల్లు కట్టుకునే వారికి ఆర్థిక సాయం, మెరుగైన ఆరోగ్య సదుపాయాలు, నగదు బహుమతి వంటి ప్యాకేజీలను ప్రభుత్వం అందజేస్తుందని వివరించారు. లొంగిపోయిన వారికి వెంటనే హెల్త్ కార్డులు జారీ చేస్తామని సీఎం ప్రకటించారు.

రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాల నిఘా ఎప్పుడూ ఉంటుందని, కాబట్టి అనవసరంగా ప్రాణాలకు ముప్పు తెచ్చుకోకుండా అందరూ లొంగిపోయి ప్రశాంతమైన జీవితాన్ని గడపాలని సీఎం సూచించారు. ఇప్పటివరకు మొత్తం 721 మంది మావోయిస్టులు లొంగిపోయారని, వారు సుమారు 250 ఆయుధాలను ప్రభుత్వానికి అప్పగించారని వెల్లడించారు. అడవిలో ఉన్న వారు తమ కుటుంబాల కోసం, సమాజం కోసం తిరిగి రావాలని ఆయన హృదయపూర్వక పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *