Siddaramaiah: కర్ణాటక రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా వేడెక్కిన ‘ముఖ్యమంత్రి మార్పు’ ఊహాగానాలకు తెరదించుతూ.. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఈ ఉదయం బెంగళూరులో భేటీ అయ్యారు. దాదాపు 40 నిమిషాలపాటు సాగిన ఈ ‘బ్రేక్ఫాస్ట్ మీటింగ్’ తర్వాత ఇద్దరు కీలక నేతలు సంయుక్తంగా మీడియాతో మాట్లాడి, తాము కలిసే ఉన్నామని, ఎలాంటి భేదాభిప్రాయాలు లేవని స్పష్టం చేశారు. ఈ సమావేశంతో కాంగ్రెస్ హైకమాండ్ సూచన మేరకు ఇద్దరు నేతల మధ్య నెలకొన్నట్లు భావిస్తున్న గందరగోళానికి పుల్స్టాప్ పడినట్లైంది.
విభేదాలు లేవు.. ఇకపైనా ఉండవు: సీఎం సిద్ధరామయ్య
బ్రేక్ఫాస్ట్ మీటింగ్ అనంతరం సీఎం సిద్ధరామయ్య మాట్లాడుతూ… తమ మధ్య ఉన్న స్నేహపూర్వక వాతావరణాన్ని గురించి వివరంగా తెలిపారు. మా ఇద్దరి మధ్య ఎలాంటి అభిప్రాయభేదాలు గతంలోనూ లేవు, ఇప్పుడు లేవు. ఈ అనవసరమైన గందరగోళానికి పుల్స్టాప్ పెట్టాలనే ఉద్దేశంతోనే మేము ఈ బ్రేక్ఫాస్ట్ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాం, అని సిద్ధరామయ్య ప్రకటించారు.
కాంగ్రెస్ అధిష్టానం (ముఖ్యంగా కేసీ వేణుగోపాల్) తాము కూర్చొని మాట్లాడుకోవాలిని సూచించినందుకే ఈ సమావేశం జరిగిందని ఆయన తెలిపారు.
ఇది కూడా చదవండి: iBomma Ravi: గుట్టు విప్పని పైరసీ కింగ్!.. ఐబొమ్మ రవి కస్టడీ ముగిసింది
2028 ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపే లక్ష్యంగా మేము కలిసి పనిచేస్తాం. కలిసి కట్టుగా బీజేపీ, జేడీఎస్లపై పోరాటం చేస్తున్నాం, అని ఆయన స్పష్టం చేశారు. భవిష్యత్లో కాంగ్రెస్ హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటామని సిద్ధరామయ్య పునరుద్ఘాటించారు.
2028 ఎన్నికల వ్యూహంపై చర్చ
ఈ భేటీ కేవలం భేదాభిప్రాయాలపై వివరణ కోసమే కాకుండా, పార్టీ భవిష్యత్తు వ్యూహాలపై కూడా దృష్టి పెట్టినట్లు సిద్ధరామయ్య వెల్లడించారు. ప్రధానంగా 2028 ఎన్నికల స్ట్రాటజీపై ఇరువురు నేతలు చర్చించినట్లు తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని స్థిరంగా కొనసాగించడం, ఇచ్చిన హామీలను పూర్తి చేయడంపైనే తమ ప్రధాన దృష్టి ఉందని వారు స్పష్టం చేశారు.
బీజేపీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడంపై జరుగుతున్న చర్చలను కూడా సిద్ధరామయ్య కొట్టిపారేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ బలం దృష్ట్యా, బీజేపీ అవిశ్వాస తీర్మానం పెట్టడం “అసాధ్యం” అని ఆయన తేల్చి చెప్పారు.
రాజకీయ వేడికి ఉపశమనం
సీఎం మార్పు, నాయకత్వ పోరుపై జాతీయ స్థాయిలో చర్చ జరుగుతున్న నేపథ్యంలో, సిద్ధరామయ్య-డీకే శివకుమార్ల ఈ సంయుక్త భేటీ, దాని అనంతరం వారి ప్రకటన.. కర్ణాటక కాంగ్రెస్ నాయకత్వంపై నెలకొన్న అనుమానాలను నివృత్తి చేసినట్టయ్యింది. ఇద్దరు అగ్రనేతలు భవిష్యత్తులోనూ ఎలాంటి భేదాభిప్రాయాలు ఉండబోవని ప్రకటించడం ద్వారా, రాష్ట్రంలో ప్రభుత్వ స్థిరత్వంపై కాంగ్రెస్ ఒక స్పష్టమైన సంకేతం ఇచ్చింది.

