AP Liquor Case

AP Liquor Case: ఏపీ మద్యం కేసులో ఊహించని ట్విస్ట్.. ఆ ముగ్గురికి ఇక భయం లేదు!

AP Liquor Case: ఆంధ్రప్రదేశ్‌లో గతంలో సంచలనం సృష్టించిన లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న బాలాజీ గోవిందప్ప, కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డిలకు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు పెద్ద ఊరటనిచ్చింది. వీరిని అరెస్టు చేయకుండా గతంలో ఇచ్చిన రక్షణను కోర్టు మరోసారి పొడిగిస్తూ కీలక ఆదేశాలు జారీ చేసింది.

అయితే, ఈ కేసు ప్రక్రియలో భాగంగా నిందితులు ముగ్గురూ రెగ్యులర్ బెయిల్ కోసం ట్రయల్ కోర్టును ఆశ్రయించాలని సుప్రీంకోర్టు సూచించింది. ఒకవేళ అక్కడ వారికి బెయిల్ నిరాకరించబడితే, ఆ తీర్పును సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్ వేసే అవకాశం ఉంటుందని తెలిపింది. హైకోర్టులో ఆ విచారణ పూర్తయ్యే వరకు వారిని అరెస్టు చేయకూడదని స్పష్టం చేస్తూ నిందితులకు గట్టి రక్షణ కల్పించింది.

అంతకుముందు, వీరికి లభించిన ‘డిఫాల్ట్ బెయిల్‌’ను రద్దు చేస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ వీరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. నిందితుల పిటిషన్లను విచారించిన సుప్రీంకోర్టు.. హైకోర్టు ఇచ్చిన తీర్పులో జోక్యం చేసుకోవడానికి నిరాకరించినప్పటికీ, నిందితుల వ్యక్తిగత స్వేచ్ఛను దృష్టిలో ఉంచుకుని అరెస్టు నుంచి రక్షణ కల్పించింది.

సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ తాజా ఆదేశాలతో ఈ కేసు మరో కీలక మలుపు తిరిగింది. ప్రస్తుతం నిందితులకు అరెస్టు భయం తప్పినప్పటికీ, రెగ్యులర్ బెయిల్ పొందేందుకు వారు చట్టపరమైన పోరాటాన్ని కొనసాగించాల్సి ఉంటుంది. ఈ పరిణామం అటు రాజకీయ వర్గాల్లోనూ, ఇటు న్యాయ వర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *