Telangana: తెలంగాణ రాష్ట్రంలో మన్సిపల్ ఎన్నికల సందడి కొనసాగుతున్నది. శుక్రవారం (జనవరి 30) వరకు నామినేషన్లకు గడువు విధించారు. దీంతో అన్ని ప్రధాన రాజకీయ పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు కూడా పెద్ద ఎత్తున నామినేషన్లను దాఖలు చేశారు. సమయం తక్కువగా ఉండటంతో ప్రధాన రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులకు బీ.ఫామ్ ఇవ్వలేదు. అనధికారికంగా పార్టీ నేతలు చెప్పిన మేరకు నామినేషన్లు వేశారు. ఈ సమయంలో పార్టీల నుంచి ఆశావహులైన వారు పలువురు నామినేషన్లు వేశారు.
Telangana: రాష్ట్రవ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు ఎన్నికలు జరుగనున్నాయి. ఫిబ్రవరి 11న పోలింగ్ జరుగుతుంది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లను చేసింది. పోలింగ్ జరిగిన రెండు రోజుల అనంతరం అంటే ఫిబ్రవరి 13న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. అదేరోజు ఫలితాలను వెల్లడించనున్నారు. ఈ మేరకు నూతన పాలక మండళ్లు కొలువుదీరేందుకు అధికార వర్గాలు ఏర్పాట్లు చేస్తున్నాయి.
Telangana: ముఖ్యంగా అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఒక్కో వార్డుకు రెండు అంతకు మించి నామినేషన్లు వేసినట్టు తెలుస్తున్నది. అధికార కాంగ్రెస్లో పెద్ద ఎత్తున పోటీ నెలకొనడంతో కొన్నిచోట్ల ముగ్గురు చొప్పున ఒక్కో స్థానానికి పోటీ పడుతున్నారు. ఇక ఫిబ్రవరి 3వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ఉండటంతో అభ్యర్థులను నిర్ణయించడంలో ఆయా పార్టీలకు తలనొప్పిగా మారింది. ఫిబ్రవరి 3వ తేదీనే సాయంత్రం తుది అభ్యర్థులను అధికారికంగా ప్రకటిస్తారు. ఈ లోగా ప్రధాన పార్టీలు తమ అభ్యర్థులను నిర్ణయించి, వారికి బీఫామ్లు ఇవ్వాల్సి ఉంటుంది.
Telangana: ఇప్పటికే మున్సిపల్ ఎన్నికల వాతావరణం వేడెక్కింది. ఆశావహులైన అభ్యర్థులు తమ అనుయాయులతో చర్చోపచర్చలు కొనసాగిస్తున్నారు. ఓటర్ల జాబితాలు చేతబట్టుకొని లెక్కలు వేసుకునే పనిలో పడ్డారు. అధికారిక బీఫామ్ కోసం ముఖ్య నేతలను మచ్చిక చేసుకుంటూ, బలాబలాలను ప్రదర్శించుకుంటున్నారు. స్వతంత్రులు కూడా పెద్ద ఎత్తున పోటీలో ఉండే అవకాశం లేకపోలేదు.
