Telangana: తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం కాక ముందు ఉమ్మడి రాష్ట్రంలో 10 జిల్లాలు ఉండేవి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించాక వాటిని తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు నేతృత్వంలోని గత బీఆర్ఎస్ ప్రభుత్వం 33 జిల్లాలుగా ఏర్పాటు చేస్తూ విభజించింది. తాజాగా కాంగ్రెస్ నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మరో జిల్లా ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తున్నది. ఈ మేరకు విభజన చర్యలు మొదలు పెట్టినట్టు సమాచారం.
Telangana: ప్రస్తుతం ఉన్న రంగారెడ్డి జిల్లాను విభజించి, రంగారెడ్డి అర్బన్ జిల్లా, రంగారెడ్డి రూరల్ జిల్లాగా విభజించేందుకు ప్రభుత్వం చర్యలు మొదలు పెట్టినట్టు తెలుస్తున్నది. ఈ జిల్లా పరిధి విస్తృతంగా ఉండటంతో పాటు ఇదే జిల్లాలో ఐటీ సంస్థలు, పెద్ద ఎత్తున పరిశ్రమలు, గేటెడ్ కమ్యూనిటీలు ఉండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నదని విశ్లేషకులు భావిస్తున్నారు.
Telangana: నూతన జిల్లా ఏర్పాటులో భాగంగానే ప్రభుత్వం గుట్టుగా వ్యూహాత్మక అడుగులు వేస్తున్నదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ మేరకే హైదరాబాద్ నగర పాలక సంస్థ (జీహెచ్ఎంసీ) పరిధి విస్తరిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నది. ఇదే సమయంలో ఇప్పటికే మూడు పోలీస్ కమిషనరేట్లుగా ఉండగా, ఫ్యూచర్ సిటీ పేరిట మరో కమిషనరేట్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నది.
Telangana: ఈ దశలో హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల సరిహద్దులను సవరించాలని రెవెన్యూ శాఖ అధికారులకు ఆదేశాలు వెళ్లాయి. ఈ మేరకు ఆ శాఖ ఉన్నతాధికారులు వివరాల సేకరణలో ఉన్నట్టు తెలుస్తున్నది. ఈ రెండు జిల్లాల సరిహద్దులు తేలాక, రంగారెడ్డి జిల్లాను రెండు జిల్లాలుగా విభజిస్తూ త్వరలో డ్రాప్ట్ నోటికేషన్ వెలువడే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నది.
Telangana: ఇదే జరిగితే షాద్నగర్, ఆమనగల్లు, కేశంపేట, తలకొండపల్లి, మాడ్గుల, కందుకూరు, మహేశ్వరం, శంషాబాద్, రూరల్ మండలం, చేవెళ్ల, యాచారం, మంచాల మండలాలను రూరల్ జిల్లాగా ఏర్పాటు చేసేందుకు అధికారులకు సూచనప్రాయ ఆదేశాలు వెళ్లాయని కూడా తెలిసింది. ఈ నూతన జిల్లాకు సీఎం రేవంత్రెడ్డికి మామ వరుస అయిన దివంగత నేత, కేంద్ర మాజీ మంత్రి సూదిని జైపాల్రెడ్డి పేరు పెట్టే ఆలోచనలో ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తున్నట్టు సమాచారం.
