Telangana: తెలంగాణ రాష్ట్ర సర్కార్ కొత్త రెవెన్యూ చట్టానికి తుది మెరుగులు దిద్దుతుంది. త్వరలో ముసాయిదా బిల్లు రెడీ చేసి నెలాఖరున ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి కొత్త రెవెన్యూ చట్టం అమల్లోకి తెచ్చేందుకు సన్నాహాలు చేస్తుంది. ధరణి పోర్టర్ భూమాత పోర్టల్ గా మార్చడంతో పాటు..హైడ్రా..మూసి రివర్ డెవలప్మెంట్ పై తీసుకునే ప్రత్యేక చర్యలపై ప్రభుత్వం దృష్టి సారించింది.
Telangana: ఈ నెలఖారులో అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలను నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. ఇందుకోసం త్వరలో కేబినేట్ సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది. వీలైనంత త్వరగా కొత్త రెవెన్యూ చట్టాన్ని అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తున్నది. కొత్త ఆర్ఓఆర్ 2024 ముసాయిదా కూడా సిద్ధమవుతోంది. దీనిపై అభిప్రాయ సేకరణ పూర్తి చేయగా.. కొన్ని మార్పులు ఉంటే సరిచేసి ఇటీవలె ఫైనల్ చేశారు. ఈ నెలఖారులోగా కొత్త రెవెన్యూ చట్టం తీసుకోస్తామని ఆ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి కూడా ఇప్పటికే స్పష్టం చేశారు. ఇటీవల రాష్ట్రంలోని తహసీల్దార్లతో నల్సార్ యూనివర్సిటీ లో.. డిప్యూటీ కలెక్టర్లు, స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లతో MCRHRD లో వేరువేరుగా సమావేశం అయ్యారు. నూతన చట్టం పై మంత్రి ప్రత్యేకంగా చర్చించారు. దీంతో అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి ఆర్ఓఆర్ బిల్లుకు ఆమోదం తీసుకునే అవకాశం ఉన్నట్లు సెక్రటేరియేట్ వర్గాలు వెల్లడించాయి.
Telangana: దీంతోపాటు హైడ్రాకు అధికారాలు ఇచ్చేందుకు ఇటీవల జీహెచ్ఎంసీ యాక్ట్కు సవరణ చేసి 374(బి) సెక్షన్ చేర్చుతూ ఆర్డినెన్స్ తెచ్చారు. ఈ సెక్షన్ కింద జీహెచ్ఎంసీలో, ప్రభుత్వ ఆధీనంలో ఉన్న రహదారులు, నీటి వనరులు, ప్రభుత్వ స్థలాలు, పార్క్ ల రక్షణ కోసం ఏజెన్సీకి అధికారం ఇవ్వడానికి ప్రభుత్వానికి అధికారం ఇచ్చారు. ఇప్పుడు దీనిని కూడా అసెంబ్లీలో సవరణ బిల్లు పెట్టి.. చట్ట సవరణ చేయాల్సి ఉంటుంది. ఇదొక్కటే కాకుండా ఇరిగేషన్, రెవెన్యూకు సంబంధించి కూడా కొన్ని అధికారాలు హైడ్రాకు బదలాయించాలంటే ఆయా చట్టాలకు సవరణలు చేయాల్సి ఉంటుంది. వీటిని కూడా అసెంబ్లీలో పెట్టాలని ప్రభుత్వం చూస్తోంది. ఈ క్రమంలోనే అసెంబ్లీ వేదికగా ఎఫ్టీఎల్, గ్రీన్ జోన్లలో ఫాంహౌజ్లు, ఇండ్లు కట్టుకున్న బీఆర్ఎస్ పెద్దల బాగోతాన్ని బయటపెట్టాలని సీఎం రేవంత్ రెడ్డి అనుకుంటున్నారు. ఇక ఇటీవల మూసీ ప్రక్షాళనకు సంబంధించి ప్రభుత్వం.. రివర్ బెడ్లో ఉన్న వారిని వేరే ప్రాంతాలకు డబుల్ బెడ్రూం ఇండ్లకు తరలిస్తోంది. అక్కడ ఉన్న నిర్మాణాలను తొలగిస్తున్నది. ఈ అంశంపై ప్రతిపక్షాలు ఆందోళనలకు దిగుతూ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ అంశంపైనా కూడా అసెంబ్లీలో చర్చించేందుకు సర్కార్ సిద్ధమైనట్లు తెలిసింది.
Telangana: బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే మూసీ ప్రక్షాళనకు తీసుకున్న నిర్ణయాలు ఏమిటనేవి సభలో పెట్టి ప్రతిపక్ష పార్టీని కడిగేయాలనుకుంటున్నది రాష్ట్ర ప్రభుత్వం. మూసి డెవలప్మెంట్ కు ఆజ్యం పోసింది బిఆర్ఎస్ హయంలోనే అని కానీ ఇప్పుడు దొంగ ఏడుపులు, పెడబొబ్బలు పెడుతోందని సిఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క ఇప్పటికే తమదైన శైలిలో రెస్పాండ్ అవుతున్నారు. అసెంబ్లీ వేదికగా ఈ అంశంపై చర్చించి ప్రజలకు నిజానిజాలు వివరించేందుకు ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. ఈ వానాకాలంకు సంబంధించి రైతు భరోసాను ఇంకా ప్రభుత్వం ఇవ్వలేదు. రెండో పంట సీజన్ కూడా వచ్చేసింది. అయితే పంటలు సాగవుతున్న భూములకే రైతుభరోసా ఇవ్వాలని నిర్ణయించి.. కేబినేట్ సబ్ కమిటీతో ప్రభుత్వం అభిప్రాయాలు స్వీకరించింది. వాటిపై అసెంబ్లీలో చర్చించి.. రైతుభరోసా అమలు మార్గదర్శకాలను ఫైనల్ చేయాలని సర్కార్ భావిస్తున్నది. ఈ దసరా నుంచే రైతు భరోసా ఇవ్వాలని తొలుత అనుకున్న నిధుల కటకట ప్రభుత్వాన్ని వెంటాడుతుంది. రుణమాఫీ పూర్తి చేశాకే రైతు భరోసా పై ఆలోచించే అవకాశం ఉంది. పెట్టుబడి సాయంగా ఇచ్చే రైతు భరోసా పై చాలా అంశాల్లో సందేహాలు ఉన్న నేపథ్యంలో దాని విధి విధానాలపై అసెంబ్లీలో చర్చించి నిర్ణయం తీసుకున్నాక ఇస్తే బాగుంటుందనే అభిప్రాయానికి ప్రభుత్వం వచ్చినట్లు తెలుస్తోంది.
Telangana: వరద నష్టంపై కేంద్రం నుంచి ఆశించిన మేర సాయం రాకపోవడంపై కేంద్ర ప్రభుత్వ తీరును ఎండగడుతూ చర్చను కూడా పెట్టాలనుకుంటున్నట్లు సమాచారం. రీజనల్ రింగ్ రోడ్,ఫార్మా సిటీ , ఫోర్త్ సిటీ ఏర్పాటుపైనా చర్చించేలా అసెంబ్లీ సమావేశాలను ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నది. ఈ విషయమై త్వరలోనే కేబినేట్ సమావేశం నిర్వహించి తరువాత క్లారిటీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈ నెలాఖరున జరపాలని భావిస్తున్న అసెంబ్లీ సమావేశాల్లో హైడ్రా.. మూసి ఇష్యూ లపై హాట్ హాట్ గా చర్చ జరిగే అవకాశం ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.