Telangana: మంత్రి కొండా సురేఖపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కోర్టులో దాఖలు చేసిన పరువునష్టం దావా కీలక మలుపు తిరిగింది. తెలంగాణ రాజకీయ వాతావరణాన్నే కుదిపేలా నాంపల్లిలోని ప్రత్యేక కోర్టు సంచలనాత్మకమైన తీర్పును ఇచ్చింది. కేటీఆర్ దాఖలు చేసిన దావా కేసు విచారణలో భాగంగా కొండా సురేఖపై కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ను జారీచేసింది.
Telangana: తనపై మంత్రి కొండా సురేఖ అసభ్యకర, వ్యక్తిత్వాన్ని దూషించే వ్యాఖ్యలు చేశారని కేటీఆర్ తన దావాలో పేర్కొన్నారు. ఈ మేరకు తనకు పరువుకు భంగం కలిగిందని నాంపల్లి కోర్టులో దావా వేశారు. ఈ మేరకు విచారణలో భాగంగా మంత్రి వ్యాఖ్యలు వ్యక్తిగత ప్రతిష్ఠను దెబ్బతీసేలా ఉన్నాయని కోర్టు భావించినట్టు సమాచారం. ఆమెపై నమోదైన కేసులో హాజరుకాకపోవడంపై కోర్టు అసహనం వ్యక్తం చేయడంతోపాటు తీవ్ర వ్యాఖ్యలు చేసింది.
Telangana: ఈ కేసులో విచారణకు హాజరుకావాల్సిందిగా పలుమార్లు నోటీసులు పంపినా మంత్రి కొండా సురేఖ కోర్టుకు హాజరు కాకపోవడంపై విచారణ జడ్జి తీవ్ర ఆక్షేపణలు వ్యక్తంచేశారు. కోర్టు ఆదేశాలను పట్టించుకోకపోవడం అత్యంత తీవ్రమైన వ్యవహారమని కోర్టు పేర్కొన్నది. ఈ విషయంలో ఆమె హాజరు విషయంలో కోర్టు గడువు విధించింది. 2026 ఫిబ్రవరి 5వ తేదీలోగా మంత్రి కొండా సురేఖ తప్పనిసరిగా కోర్టు ముందు ప్రత్యక్షంగా హాజరుకావాలని ఆదేశించింది. లేకపోతే నాన్బెయిల్ వారెంట్ అమలు చేయాలని కోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది.
Telangana: ఒకవేళ మంత్రి కొండా సురేఖ హాజరు కాకపోతే నాన్ బెయిలబుల్ వారెంట్ను జారీచేసి పోలీసులు ఆమెను కోర్టు తీసుకురావాలని న్యాయమూర్తి ఆదేశించారు. దీంతో ఈ కేసులో కీలక దశకు చేరుకున్నదని న్యాయవర్గాలు భావిస్తున్నాయి. ఈ కేసు ప్రభావం రాజకీయ వర్గాల్లో కూడా ప్రభావం చూపుతుందని చెప్తున్నారు. తాజాగా పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఈ కేసు ముందుకు రావడం మరింత ఆసక్తికరంగా మారిందని చెప్పవచ్చు.
