Telangana: జర్నలిస్టులకు అక్రెడిటేషన్ కార్డుల జారీ కోసం రాష్ట్ర ప్రభుత్వం తాజాగా తీసుకొచ్చిన 252 జీవోను సవరించాలని కోరుతూ హైదరాబాద్ సహా రాష్ట్రవ్యాప్తంగా జర్నిలిస్టులు పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగారు. అన్ని జిల్లాల కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు నిర్వహించారు. వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ జీవో కారణంగా అక్రెడిటేషన్లు తగ్గడంతోపాటు డెస్క్ జర్నలిస్టులకు అన్యాయం జరుగుతుందని తీవ్ర ఆందోళన వ్యక్తంచేశారు.
Telangana: జీవో 252 పేరిట జర్నలిస్టుల అక్రెడిటేషన్లకు కోత పెట్టడాన్ని నిరసిస్తూ టీయూడబ్ల్యూజే (టీజేఎఫ్) ఆధ్వర్యంలో అన్ని జిల్లా కలెక్టరేట్ల ఎదుట ఆందోళనలకు పిలుపునిచ్చింది. కలెక్టర్లను కలిసి వినతిపత్రాలు ఇవ్వాలని కోరింది. ఈ మేరకు హైదరాబాద్లోని జిల్లా కలెక్టరేట్లో వినతిపత్రం ఇవ్వడానికి వెళ్తున్న యూనియన్ నేతలను పోలీసులు అరెస్టు చేసి వివిధ పోలీస్స్టేషన్లకు తరలించారు. ఈ సందర్భంగా ఆ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుతీసాగర్, ఉపాధ్యక్షుడు రమేశ్ హజారీ, నాయకులు యోగానంద్, అవ్వారి భాస్కర్ తదితరులను అరెస్టు చేశారు.
Telangana: అదే విధంగా డెస్క్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో అన్ని జిల్లాకేంద్రాల్లో శాంతియుత నిరసనలు, కలెక్టర్లకు వినతిపత్రాలు ఇవ్వాలని పిలుపునిచ్చింది. ఈ మేరకు నిరసన కార్యక్రమాలు కొనసాగాయి. హైదరాబాద్ కలెక్టరేట్ ఎదుట జరిగిన కార్యక్రమంలో వివిధ పత్రికల్లో పనిచేసే సబ్ ఎడిటర్లు నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు.
Telangana: మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ కార్యక్రమంలో పాల్గొన్న సమాచార, పౌరసరఫరాలు, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ఖమ్మం జిల్లాకు చెందిన డెస్క్ జర్నలిస్టులు కలిసి వినతిపత్రం అందజేశారు. డెస్క్ జర్నలిస్టులకు అక్రెడిటేషన్ కార్డులు కాకుండా, మీడియా కార్డులంటూ వివక్ష చూపడం సరికాదంటూ మంత్రికి విన్నవించారు. ఈ మేరకు స్పందించిన మంత్రి డెస్క్ జర్నలిస్టుల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
