TG High Court: కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణపై తెలంగాణ హైకోర్టులో సోమవారం కీలక విచారణ జరిగింది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్, మాజీ సీఎస్ ఎస్కే జోషి దాఖలు చేసిన పిటిషన్లను న్యాయస్థానం విచారించింది. తమపై జరుగుతున్న విచారణపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ వారు దాఖలు చేసిన ఈ పిటిషన్ల విషయంలో కోర్టు తాజా ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రభుత్వం గతంలో దాఖలు చేసిన కౌంటర్ సమాధానానికి బదులుగా, పిటిషనర్లు తమ రిప్లై (సమాధానం) ఫైల్ చేశారు. ఇరు పక్షాల వాదనలను విన్న గౌరవ హైకోర్టు, ఈ కేసు తదుపరి విచారణను ఫిబ్రవరి 25వ తేదీకి వాయిదా వేసింది.
ఇది కూడా చదవండి: Karur Stampede Case: రెండోసారి సీబీఐ ముందుకు నటుడు విజయ్.. ఢిల్లీలో విచారణ!
అప్పటి వరకు పిటిషనర్లపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని స్పష్టం చేస్తూ, వారికి తాత్కాలికంగా ఊరట కల్పించింది. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిషన్ విచారణ తీరును సవాల్ చేస్తూ వీరు కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.
ఫిబ్రవరి 25న జరగబోయే విచారణలో కోర్టు తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అప్పటివరకు ఈ కేసులో ఎలాంటి పురోగతి ఉంటుందో అని రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ప్రభుత్వం మరియు కమిషన్ తమ వాదనలను బలంగా వినిపిస్తుండగా, పిటిషనర్లు తమ వైపు న్యాయం ఉందని వాదిస్తున్నారు.
