Telangana Global Rising Summit

Telangana Global Rising Summit: తెలంగాణ ఆశయాలకు ఆకాశమే హద్దు.. 3 వేల డ్రోన్లతో గిన్నిస్ రికార్డుకు సన్నాహాలు!

Telangana Global Rising Summit: అభివృద్ధి, ప్రగతి లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్–2025’ ముగింపు వేడుకలు అద్భుత దృశ్యకావ్యంగా నిలవనున్నాయి. డిసెంబర్ 8, 9 తేదీల్లో హైదరాబాద్‌లోని భారత్ ఫ్యూచర్ సిటీలో జరగబోయే ఈ సమ్మిట్ ముగింపు ఘట్టంలో, ప్రపంచ రికార్డును అధిగమించేలా భారీ డ్రోన్ షో నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.

3 వేల డ్రోన్లతో నినాదం ఆవిష్కరణ

తెలంగాణ ఎదుగుదలను ప్రపంచానికి చాటిచెప్పే లక్ష్యంతో, డిసెంబర్ 9న ఈ డ్రోన్ షోను నిర్వహించనున్నారు. ఒకేసారి ఏకంగా 3 వేల డ్రోన్లను ఆకాశంలో ప్రదర్శించి, “తెలంగాణ ఈజ్ రైజింగ్.. కం, జాయిన్ ది రైజ్” (Telangana is Rising.. Come, Join the Rise) అనే నినాదాన్ని అక్షర రూపంలో ఆవిష్కరించనున్నారు. ఈ డ్రోన్ షో ద్వారా ప్రపంచంలోనే అత్యంత పొడవైన వాక్యాన్ని డ్రోన్లతో ప్రదర్శించిన ఘనతను సొంతం చేసుకుని గిన్నిస్ వరల్డ్ రికార్డు నెలకొల్పాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

యూఏఈ రికార్డు బ్రేక్ లక్ష్యం

ప్రస్తుతం, డ్రోన్లతో ఆకాశంలో అత్యంత పొడవైన వాక్యాన్ని ప్రదర్శించిన రికార్డు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) అబుధాబీ పేరిట ఉంది. 2025 నూతన సంవత్సర వేడుకల సందర్భంగా యూఏఈ 2,131 డ్రోన్లతో “హ్యాపీ న్యూ ఇయర్” (Happy New Year) అనే వాక్యాన్ని ప్రదర్శించి ఆ రికార్డును అందుకుంది. ఇప్పుడు, తెలంగాణ ప్రభుత్వం అంతకు మించిన సంఖ్యలో (3,000 డ్రోన్లు) ఉపయోగించి, ఈ రికార్డును బద్దలు కొట్టేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తోంది.

ఇది కూడా చదవండి: Ditwah Cyclone: దూసుకొస్తున్న దిత్వా తుపాను.. ఏపీలోని ఈ రెండు జిల్లాల్లో భారీ వర్షాలు..

సదస్సు ప్రధాన లక్ష్యం: ‘తెలంగాణ రైజింగ్ 2047’

కేవలం ఆకర్షణీయమైన డ్రోన్ షోకే పరిమితం కాకుండా, ఈ గ్లోబల్ సమ్మిట్ వెనుక బలమైన లక్ష్యం ఉంది. వికసిత్ భారత్-2047 జాతీయ వృద్ధి లక్ష్యాలకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్రంలోని ప్రజా ప్రభుత్వం ‘తెలంగాణ రైజింగ్ 2047’ డాక్యుమెంట్‌ను తయారు చేసింది.

ఆర్థిక వృద్ధి, అన్ని రంగాల ప్రగతి, అన్ని వర్గాల సంక్షేమం, సాధికారత మరియు సమ్మిళిత వృద్ధి సాధించడం.రెండు రోజుల సదస్సులో ఈ లక్ష్యాలను ప్రపంచ వేదికపై ప్రదర్శిస్తారు. డిసెంబర్ 9న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ ‘తెలంగాణ రైజింగ్ 2047’ డాక్యుమెంట్‌ను ఆవిష్కరించి, భవిష్యత్తు తెలంగాణకు రోడ్‌మ్యాప్‌ను ప్రకటిస్తారు.

ప్రత్యేక ఆకర్షణ: ఫుట్‌బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ

ఈ గ్లోబల్ సమ్మిట్‌కు ప్రత్యేక ఆకర్షణగా అంతర్జాతీయ ఫుట్‌బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ రాక నిలవనుంది. డిసెంబర్ 13న ఆయన హైదరాబాద్‌కు రానున్నారు. మెస్సీ పాల్గొనే వేడుకలోనే ఒక ప్రత్యేక ఫుట్‌బాల్ మ్యాచ్‌ను నిర్వహించనున్నారు. ఇది తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు ప్రత్యేక ఆకర్షణగా, ముగింపు ఘట్టంగా నిలవనుంది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *