Telangana: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో సిట్టింగ్ స్థానాన్ని నిలుపుకునేందుకు బీఆర్ఎస్ పార్టీ శతవిధాలా పోరాడుతున్నదనడానికి ఆ పార్టీ ఈ రోజు (అక్టోబర్ 27) చేపట్టిన కార్యక్రమం కూడా నిదర్శనంగా నిలుస్తున్నది. ఉచిత బస్సు తెచ్చిన కాంగ్రెస్ సర్కార్ ఆటో కార్మికులను ఇప్పటి వరకూ ఆదుకోలేదని చెప్పడానికి ఈ రోజు ఆ పార్టీ వినూత్న కార్యక్రమం చేపట్టింది. దానిలో భాగంగా ఆ పార్టీ కీలక నేత హరీశ్రావు సహా ఇతర ముఖ్య నేతలు తమ ఇండ్ల నుంచి ఆటోలు ఎక్కి ప్రచారం చేసే చోటుకు వెళ్లారు.
Telangana: హరీశ్రావు తన నివాసం నుంచి కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుతో కలిసి ఎర్రగడ్డ గోకుల్ థియేటర్ వరకూ ఆటోలో ప్రయాణించారు. న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి బీఆర్ఎస్ మహిళా ప్రతినిధులైన పద్మా దేవేందర్రెడ్డి, మాలోత్ కవిత తదితరులు మహిళా కమిషన్ కార్యాలయం వరకు ఆటోలో ప్రయాణించారు. ఈ సందర్భంగా వారంతా ఆటో కార్మికుల సమస్యలను తెలుసుకున్నారు.
Telangana: బీఆర్ఎస్ సికింద్రాబాద్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తన నివాసం నుంచి స్వయంగా ఆటో నడుపుతూ జూబ్లీహిల్స్ నియోజకవర్గం వరకూ వచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆటో డ్రైవర్లు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకునేందుకు తాము ఇలా ఆటోలలో ప్రయాణిస్తూ, నడుపుతూ వచ్చామని తెలిపారు. అదే విధంగా రెహ్మత్నగర్ వద్ద మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్, కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి ఆటో కార్మికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారికి ఈ సందర్భంగా ధైర్యం చెప్పారు.
Telangana: అనంతరం హరీశ్రావు, తలసాని శ్రీనివాస్యాదవ్, శ్రీనివాస్గౌడ్, పట్నం నరేందర్రెడ్డి తదితరులు మాట్లాడుతూ కాంగ్రెస్ సర్కార్పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలకు ముందు ఆనాడు ఓట్ల కోసం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ ఆటో ఎక్కి ప్రచారం చేశారని గుర్తు చేశారు. రెండేండ్లయినా ఆటో కార్మికుల బతుకులు ఆగమైతున్నా ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు.
Telangana: ఇప్పుడు రాహుల్గాంధీ హైదరాబాద్కు ఎప్పుడొచ్చినా మొత్తం ఆటోలన్నీ తీసుకెళ్లి శంషాబాద్లో అడ్డంపెట్టి ఆటో కార్మికులు నిరసన తెలుపుతారని హెచ్చరించారు. ఆటో కార్మికులు సీఎం రేవంత్రెడ్డి కళ్లు తెరిపించాలని, రాహుల్ గాంధీకి ఆటో కార్మికుల బాధలు తెలియాలని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా ఇలా ఆటోలు ఎక్కి నిరసన తెలుపుతున్నట్టు తెలిపారు.
Telangana: వెంటనే ఆటో కార్మికులకు బాకీ పడిన ఏటా రూ.24 వేలను ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల 161 మంది ఆటో కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారని, వారి కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తంచేశారు. మద్యం టెండర్ల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఇటీవలే రూ.3,000 కోట్ల ఆదాయం సమకూరిందని, దానిలో నుంచి రూ.1,500 కోట్లను ఆటో కార్మికుల సంక్షేమానికి కేటాయించి, వారిని ఆదుకోవాలని కోరారు.
Telangana: వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, తమ ప్రభుత్వ హయాంలోనే ఆటో కార్మికులను తప్పకుండా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఉచితంగా నడిపి ఐనా పదుల ఓట్లు బీఆర్ఎస్ పార్టీకి వేయిస్తానని అక్కడే ఓ డ్రైవర్ ప్రకటించి, తన నిరసనను ప్రభుత్వానికి తెలిపారు.
