Malla Reddy: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్ర అభివృద్ధి బాగా జరుగుతుంది అని తెలంగాణ మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి అన్నారు. ఏపీకి ప్రధాని నరేంద్ర మోదీ లక్షల కోట్లు కేటాయిస్తున్నారని, ఆ నిధులతో చంద్రబాబు అభివృద్ధి పథకాలను పరుగులు తీయిస్తున్నారని అన్నారు.
మంగళవారం ఉదయం మల్లారెడ్డి కుటుంబసమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన, ‘‘నా పుట్టినరోజు రోజున ప్రతి ఏడాది స్వామివారి దర్శనానికి వస్తుంటాను అని తెలిపారు. గతేడాది యూనివర్సిటీల కోసం ప్రార్థించాను. ప్రస్తుతం నేను దేశంలోనే మూడు పెద్ద డీమ్డ్ యూనివర్సిటీలను నడిపిస్తున్నాను’’ అని తెలిపారు.
ఇది కూడా చదవండి: Rajahmundry: రాజమండ్రిలో దారుణం: మద్యం తాగి పోలీసులపై దాడి
తన రాజకీయ ప్రస్థానం, తెలంగాణ అభివృద్ధి, రియల్ ఎస్టేట్ పరిస్థితులపై కూడా మల్లారెడ్డి స్పందించారు. ‘‘తెలంగాణలో మాజీ సీఎం కేసీఆర్ హయాంలో పది సంవత్సరాల్లో దేశంలో ఎక్కడా లేని అభివృద్ధి సాధించారు. హైదరాబాద్కు మల్టీ నేషనల్ కంపెనీలను కేటీఆర్ తీసుకొచ్చారు. ప్రస్తుతం రియల్ ఎస్టేట్ పరిస్థితి అంతగా బాగోలేదు. గతంలో ఏపీలో ఆస్తులు అమ్ముకుని హైదరాబాద్కు వచ్చే పరిస్థితి ఉండేది. ఇప్పుడు పరిస్థితి రివర్స్ అయింది. తెలంగాణ వ్యాపారులు ఏపీలో ఆస్తులు కొనుగోలు చేస్తున్నారు’’ అని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో కేసీఆర్ మళ్లీ అధికారంలోకి వస్తే పాత రోజులు తిరిగి వస్తాయని మల్లారెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.