Maganti Gopinath: బీఆర్ఎస్ దివంగత నేత, జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణం వ్యవహారం కీలక మలుపు తిరిగింది. గుండెపోటుతో మరణించారని అంతా భావిస్తున్న తరుణంలో, మృతిపై పలు అనుమానాలను వ్యక్తం చేస్తూ స్వయంగా ఆయన తల్లి మాగంటి మహానందకుమారి రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన కుమారుడి మృతి వెనుక నిర్లక్ష్యం, కుట్ర ఉన్నాయని ఆరోపిస్తూ ఆమె శనివారం పొద్దుపోయాక పోలీసులను ఆశ్రయించారు.
ఫిర్యాదులో తల్లి మహానందకుమారి సంచలన ఆరోపణలు
మహానందకుమారి తన ఫిర్యాదులో లేవనెత్తిన ప్రధాన అంశాలు ఇవి..గోపీనాథ్ ఏఐజీ ఆసుపత్రిలో చేరిన తర్వాత, తన కుమార్తె (గోపీనాథ్ కుమార్తె) దిషిర సంతకం చేసిన లేఖ ఆధారంగా ఆసుపత్రి భద్రతా సిబ్బంది తనను కుమారుడిని చూసేందుకు అనుమతించలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఐసీయూలో, వెంటిలేటర్పై ఉన్నప్పుడు కూడా తనను అడ్డుకున్నారని తెలిపారు.
అయితే, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మాత్రం ఎలాంటి అడ్డంకులు లేకుండా గోపీనాథ్ను కలిశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ వివక్ష తన అనుమానాలను మరింత బలపరిచిందని తెలిపారు.
కేటీఆర్ వచ్చి వెళ్లేంత వరకు గోపీనాథ్ మరణవార్తను అధికారికంగా ప్రకటించలేదని, అసలు లోపల ఏం జరిగిందో కేటీఆరే చెప్పాలి అని ఆమె డిమాండ్ చేయడం రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది.
ఇది కూడా చదవండి: Samantha: దాచడానికి ఏమీ లేదు… ఓపెన్ గా చెప్పేసిన సామ్!
గోపీనాథ్ మరణానికి ముందు అనేక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడని, అయినప్పటికీ సకాలంలో వైద్యం అందించడంలో నిర్లక్ష్యం వహించారని ఆరోపించారు. ముఖ్యంగా డయాలసిస్లో జాప్యం, మూత్రపిండాల తొలగింపు తర్వాత తీసుకున్న నిర్ణయాలపై అనుమానాలు వ్యక్తం చేశారు.
గోపీనాథ్కు కేటాయించిన గన్మెన్లు, భద్రతా సిబ్బంది ఆయన కుప్పకూలినప్పుడు అందుబాటులో లేరని, అత్యవసర చికిత్స (సీపీఆర్) అందించడంలో విఫలమయ్యారని ఆరోపించారు. తన కోడలు మాగంటి సునీత, కేటీఆర్ ఇద్దరూ నిజాలు దాస్తున్నారని ఆమె తీవ్రంగా ఆరోపించారు.
రాజకీయ స్పందన
ఈ వ్యవహారం రాజకీయంగా వేడెక్కడంతో ముఖ్యమంత్రితో సహా పలువురు నేతలు స్పందించారు: ఎవరైనా అధికారికంగా ఫిర్యాదు చేస్తే తప్పకుండా విచారణ జరిపిస్తామని, కన్నతల్లి ఆవేదనను తక్కువగా చూడలేమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందిస్తూ, గోపీనాథ్ మృతిపై పూర్తిస్థాయి విచారణ జరపాలని, దీని వెనుక ఆస్తి వివాదాలు ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు.
గోపీనాథ్ తల్లి ఆసుపత్రి పరీక్షల ఫలితాలు, చికిత్స వివరాలకు సంబంధించిన కొన్ని ప్రతులను పోలీసులకు అందించారు. రాయదుర్గం ఇన్స్పెక్టర్ వెంకన్న, ఫిర్యాదుపై ప్రాథమిక విచారణ అనంతరం తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు. పోలీసుల విచారణతో ఈ మృతి వెనుక ఉన్న వాస్తవాలు వెలుగులోకి వస్తాయని అందరూ ఆశిస్తున్నారు.

