CM Chandrababu

CM Chandrababu: వైసీపీకి అసెంబ్లీలో చర్చించే ధైర్యం ఉందా?: చంద్రబాబు నాయుడు

CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ‘సూపర్ సిక్స్ – సూపర్ హిట్’ బహిరంగ సభలో మాట్లాడుతూ, ఇది ఓట్ల కోసం లేదా రాజకీయాల కోసం నిర్వహించిన సభ కాదని, బాధ్యత గల ప్రభుత్వానికి నిదర్శనమని అన్నారు. గత ప్రభుత్వం చేసిన తప్పులను సరిచేస్తూ, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. ఈ సభ తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్ని నింపిందని ఆయన అన్నారు.

ప్రజలు ఇచ్చిన చారిత్రక తీర్పు
చంద్రబాబు నాయుడు 2024 ఎన్నికలు చరిత్రను తిరగరాశాయని, 57 శాతం మంది ప్రజలు కూటమికి ఓటు వేశారని తెలిపారు. కూటమికి 95 శాతానికి పైగా స్ట్రైక్ రేట్ ఇచ్చి ప్రజలు తమ నమ్మకాన్ని చాటారని ఆయన చెప్పారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని రూ.10 లక్షల కోట్ల అప్పుల ఊబిలోకి నెట్టిందని, కేంద్ర పథకాలను కూడా నిలిపివేసిందని విమర్శించారు. నిర్వీర్యమైన వ్యవస్థలను సరిదిద్ది, పాలనను గాడిలో పెడుతున్నామని ఆయన అన్నారు.

సూపర్ సిక్స్ పథకాల విజయగాథ: 
కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న ‘సూపర్ సిక్స్’ పథకాలు సూపర్ హిట్ అయ్యాయని చంద్రబాబు తెలిపారు.
స్త్రీశక్తి: ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించడం ద్వారా ఆడబిడ్డల సంతోషాన్ని చూశానని ఆయన అన్నారు.
తల్లికి వందనం: ఈ పథకం కూడా సూపర్ హిట్ అయిందని పేర్కొన్నారు.
అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్: అన్నం పెట్టే రైతులకు ఈ పథకం అండగా నిలిచిందని చెప్పారు.
దీపం-2: ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నామని తెలిపారు.
మెగా డీఎస్సీ ద్వారా 16,347 ఉపాధ్యాయ ఉద్యోగాలను భర్తీ చేసి యువత భవిష్యత్తుకు బాటలు వేశామని, అలాగే లక్షమందికి నైపుణ్య శిక్షణ అందించి ఉపాధి కల్పించామని ఆయన పేర్కొన్నారు.
ఆటో డ్రైవర్లకు గుడ్‌న్యూస్: దసరా రోజు నుంచి ‘వాహనమిత్ర’ పథకం కింద ఆటో డ్రైవర్లకు రూ.15,000 ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించారు.

Also Read: Pawan Kalyan: ఆర్థిక ఇబ్బందులు ఉన్నా, ప్రజల సంక్షేమం మా లక్ష్యం: పవన్ కల్యాణ్

వైసీపీపై విమర్శలు
వైసీపీ నాయకులు మెడికల్ కాలేజీల గురించి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని చంద్రబాబు నాయుడు విమర్శించారు. భూమి ఇచ్చి పునాదులు వేస్తే అది మెడికల్ కాలేజీ కాదని, వాటిని పూర్తి చేయాలంటే చిత్తశుద్ధి ఉండాలని అన్నారు. ధైర్యం ఉంటే అసెంబ్లీకి వచ్చి చర్చించాలని సవాల్ విసిరారు. వైసీపీ ఉనికి కోల్పోతుందని, వారి పార్టీ కార్యాలయాలు మూసేసి, సోషల్ మీడియా ఆఫీసులు తెరిచారని ఎద్దేవా చేశారు. హింసా రాజకీయాలు చేస్తే చట్టం ముందు నిలబెడతామని హెచ్చరించారు.

ALSO READ  IOA Approves Bid: 2030 కామన్వెల్త్‌ క్రీడల బిడ్‌కు అధికారికంగా ఆమోదం

రాయలసీమ అభివృద్ధిపై చంద్రబాబు ధీమా
రాయలసీమను ‘రతనాల సీమ’గా మార్చేందుకు బ్లూప్రింట్ తయారు చేశామని, కృష్ణమ్మ నీళ్లను కుప్పం వరకు తీసుకొచ్చామని చంద్రబాబు తెలిపారు. గత ప్రభుత్వం ఐదేళ్లలో చేయలేని పనిని కూటమి ప్రభుత్వం వంద రోజుల్లో చేసిందని అన్నారు. రాయలసీమలో కరువును శాశ్వతంగా నివారించి, డిఫెన్స్, ఏరోస్పేస్, గ్రీన్ ఎనర్జీ వంటి పరిశ్రమలను తీసుకొస్తామని హామీ ఇచ్చారు. ఎవరూ అడ్డుపడినా రాయలసీమ అభివృద్ధి ఆగదని స్పష్టం చేశారు.

ప్రధాని మోదీకి ధన్యవాదాలు
రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రధాని నరేంద్ర మోదీ అండగా ఉన్నారని, ఏపీకి సహకరిస్తున్నందుకు ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. దసరా నుంచి కేంద్రం జీఎస్టీ తగ్గిస్తుందని కూడా ఆయన వెల్లడించారు. తాము పాలకులం కాదని, ప్రజలకు సేవకులం అని, అవినీతికి తావు ఇవ్వబోమని చంద్రబాబు అన్నారు. చివరిగా, కూటమిలోని మూడు పార్టీల కార్యకర్తలు ఐకమత్యంతో పనిచేసి, ‘హెల్తీ, వెల్తీ, హ్యాపీ సొసైటీ’ని నిర్మించాలని పిలుపునిచ్చారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *