Sunteck Realty: దేశంలో రియాల్టీ సెక్టార్ వేగంగా రూపుమారుస్తోంది. ఒకప్పుడు మధ్యతరగతి కుటుంబాలను దృష్టిలో పెట్టుకుని అపార్ట్మెంట్లు, హౌసింగ్ ప్రాజెక్టులు నిర్మించేవి. కానీ, ఇప్పుడు ట్రెండ్ పూర్తిగా మారిపోయింది. సూపర్ రిచ్ కస్టమర్లను లక్ష్యంగా చేసుకుని రియాల్టీ సంస్థలు అల్ట్రా లగ్జరీ హౌసింగ్ ప్రాజెక్టులపై దృష్టి సారిస్తున్నాయి.
ఎమాన్సే బ్రాండ్తో ఎంట్రీ
ఈ క్రమంలోనే ప్రముఖ రియాల్టీ సంస్థ సన్టెక్ రియాల్టీ “ఎమాన్సే” (Emansé) అనే కొత్త బ్రాండ్ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఈ బ్రాండ్ కింద నిర్మించే ఫ్లాట్ల ధరలు ఒక్కో యూనిట్కి కనీసం 100 కోట్ల నుంచి 500 కోట్ల వరకు ఉండనున్నాయి. అంతటి భారీ ప్రాజెక్ట్ వినగానే “ఇది నిజమా?” అన్న సందేహాలు రావడం సహజమే. కానీ సన్టెక్ మాత్రం రియాల్టీ మార్కెట్లో లగ్జరీ లివింగ్కి కొత్త ప్రమాణాలు సృష్టించడానికి సిద్ధమైంది.
ఇది కూడా చదవండి: VC Sajjanar: నా స్టాప్ వచ్చేసింది.. హైదరాబాద్ పోలీస్ కమిషనర్గా బాధ్యతలు స్వీకరించిన సజ్జనార్.
ఆహ్వానం ద్వారానే విక్రయం
ఈ హై-ఎండ్ ప్రాజెక్టులు సాధారణంగా బుకింగ్కు అందుబాటులో ఉండవు. ప్రత్యేకంగా ఆహ్వానం ద్వారానే విక్రయం జరగనుందని సంస్థ సీఎండీ కమల్ ఖేతన్ ప్రకటించారు. మొదటి దశలో ముంబైలోని నేపియన్సీ రోడ్, అలాగే దుబాయ్లోని బుర్జ్ ఖలీఫా ప్రాంతాల్లో ఈ ప్రతిష్టాత్మక నిర్మాణాలు చేపట్టనున్నారు.
రూ. 20 వేల కోట్ల ఆదాయ లక్ష్యం
2026 జూన్ నాటికి ఈ రెండు ప్రాజెక్టుల నిర్మాణం ప్రారంభించే యోచనలో ఉంది. వీటి ద్వారా కనీసం 20,000 కోట్ల ఆదాయం వచ్చే అవకాశం ఉందని కంపెనీ అంచనా వేస్తోంది. ముఖ్యంగా, ఇది సన్టెక్ రియాల్టీకి తొలి అంతర్జాతీయ ప్రాజెక్ట్ కావడం ప్రత్యేకత. ఇక్కడ చదరపు అడుగు ధరే 2.5 లక్షల పైగానే ఉండనుందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
రికార్డులు బద్దలుకొట్టే ప్రాజెక్ట్
ఇప్పటివరకు భారత్లో లగ్జరీ హౌసింగ్ ప్రాజెక్టులలో డీఎల్ఎఫ్ కామెల్లియాస్ ప్రాముఖ్యత కలిగింది. ఒక్కో ఫ్లాట్ ధర 100 కోట్ల వరకు చేరింది. అయితే, సన్టెక్ రాబోతున్న ప్రాజెక్టులు ఆ రికార్డును సులభంగా బద్దలుకొట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. గురుగ్రామ్లో ఇప్పటికే వందల కోట్లకు ఫ్లాట్ అమ్ముడైన సందర్భం ఉన్నప్పటికీ, ఇప్పుడు సన్టెక్ మాత్రం ఆ మార్కెట్ను కొత్త ఎత్తుకు తీసుకెళ్లనుంది.