Sunetra Pawar: మహారాష్ట్ర రాజకీయ చరిత్రలో ఒక అరుదైన ఘట్టం చోటుచేసుకుంది. రాష్ట్ర తొలి మహిళా ఉప ముఖ్యమంత్రిగా సునేత్రా పవార్ ఈరోజు బాధ్యతలు స్వీకరించారు. రాజ్భవన్లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ ఆమెతో పదవీ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, మరో ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేతో పాటు ఎన్సీపీ ముఖ్య నేతలు, ఎమ్మెల్యేలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
అజిత్ పవార్ అకాల మరణం తర్వాత మహారాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు సంభవించాయి. ఆయన మరణించిన మూడు రోజులకే సునేత్రా పవార్ను ఈ అత్యున్నత పదవికి ఎంపిక చేయడం గమనార్హం. అజిత్ పవార్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకే పార్టీ ఆమెను ఈ కీలక బాధ్యతలకు ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ప్రమాణ స్వీకారం చేసే సమయంలో అక్కడ ఉన్న ఎన్సీపీ కార్యకర్తలు, నేతలు అజిత్ పవార్ అమర్ రహే అంటూ చేసిన నినాదాలు హోరెత్తాయి.
మహారాష్ట్ర ఏర్పడినప్పటి నుండి ఇప్పటివరకు ఏ మహిళా కూడా ఉప ముఖ్యమంత్రి పదవిని చేపట్టలేదు. ఆ రకంగా సునేత్రా పవార్ ఒక సరికొత్త రికార్డును సృష్టించారు. అజిత్ పవార్ వారసురాలిగా రాజకీయాల్లోకి ప్రవేశించిన ఆమెకు, ఇప్పుడు పాలనాపరంగా పెద్ద సవాలు ఎదురుకానుంది. పార్టీ శ్రేణులు, ప్రజల మద్దతుతో ఆమె రాష్ట్రాభివృద్ధిలో తనదైన ముద్ర వేస్తారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
#WATCH | Mumbai: NCP leaders chant ‘Ajit dada amar rahe’ as Sunetra Pawar, leader of the NCP legislative party and wife of late Deputy CM Ajit Pawar, takes oath as Deputy CM of Maharashtra at the Lok Bhavan pic.twitter.com/RU1cUXTbld
— ANI (@ANI) January 31, 2026
