Sunetra: మహారాష్ట్ర రాజకీయ చరిత్రలో నేడు ఒక చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతం కానుంది. రాష్ట్ర తొలి మహిళా ఉపముఖ్యమంత్రిగా సునేత్రా పవార్ బాధ్యతలు చేపట్టబోతున్నారు. గత బుధవారం బారామతి విమానాశ్రయం సమీపంలో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో డిప్యూటీ సీఎం అజిత్ పవార్ అకాల మరణం చెందిన సంగతి తెలిసిందే. ఈ విషాదకర పరిస్థితుల నేపథ్యంలో, పార్టీని, అజిత్ పవార్ రాజకీయ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ఎన్సీపీ (అజిత్ వర్గం) సునేత్రా పవార్ను కీలక పదవికి ఎంపిక చేసింది.
నేడు (జనవరి 31, శనివారం) మధ్యాహ్నం 2 గంటలకు ముంబైలోని విధాన్ భవన్లో ఎన్సీపీ శాసనసభాపక్ష సమావేశం జరగనుంది. ఈ భేటీలో సునేత్రా పవార్ను పార్టీ శాసనసభాపక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకోనున్నారు. అనంతరం సాయంత్రం 5 గంటలకు ముంబైలోని లోక్భవన్లో ఆమె ఉపముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. సునేత్రా పవార్ ప్రస్తుతం రాజ్యసభ సభ్యురాలిగా ఉన్నప్పటికీ, అజిత్ పవార్ మరణంతో ఖాళీ అయిన బారామతి అసెంబ్లీ స్థానం నుండి ఆమె త్వరలో ఉపఎన్నిక బరిలో నిలిచే అవకాశం ఉంది.
Also Read: Revanth Reddy: ప్రజల గుండెల్లో శాశ్వతంగా గద్దర్..
ప్రభుత్వంలో ఆమెకు గతంలో అజిత్ పవార్ నిర్వహించిన ఎక్సైజ్, క్రీడా శాఖలను కేటాయించనున్నట్లు సమాచారం. అయితే, అత్యంత కీలకమైన ఆర్థిక శాఖను మాత్రం ప్రస్తుతం ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తన వద్దే ఉంచుకునే అవకాశం ఉంది. వచ్చే నెలలో జరగనున్న బడ్జెట్ సమావేశాల్లో 2026-27 సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ను ఫడ్నవీస్ స్వయంగా ప్రవేశపెట్టే సూచనలు కనిపిస్తున్నాయి. అజిత్ పవార్ మరణానికి దారితీసిన విమాన ప్రమాదంపై ఇప్పటికే సీఐడీ విచారణ ప్రారంభమైంది. విజిబిలిటీ తక్కువగా ఉండటం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ప్రాథమిక నివేదికలు చెబుతున్నాయి.
మరోవైపు, అజిత్ పవార్ మరణం తర్వాత ఎన్సీపీలోని రెండు వర్గాల విలీనంపై రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. శరద్ పవార్ నాయకత్వంలోని వర్గంతో పునరేకీకరణకు అజిత్ పవార్ బతికున్నప్పుడే చర్చలు జరిగాయని, ఇప్పుడు సునేత్రా పవార్ పదవీ బాధ్యతలు చేపట్టడం ఈ విలీన ప్రక్రియపై ఎలాంటి ప్రభావం చూపుతుందనేది ఆసక్తికరంగా మారింది. ప్రఫుల్ పటేల్ వంటి సీనియర్ నేతలు సునేత్రా ఎంపికను సమర్థిస్తుండగా, రాబోయే రోజుల్లో మహారాష్ట్ర రాజకీయం ఏ మలుపు తిరుగుతుందో చూడాలి.
